కొవిడ్ వ్యాక్సిన్ల కొరత: సంచలన ట్విస్ట్ -జో బైడెన్కు సీరం సీఈవో ట్వీట్ -నిలదీత -మోదీ సర్కార్ ఏం చేస్తోంది?
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతుండగా, వ్యాక్సిన్ల కొరత, టీకాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల ఎగుమతులపై నిషేధం, ఫార్మా సంస్థలకు ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై నెలకొన్ని వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇండియా కేంద్రంగా పనిచేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా ఉన్న సీరం సంస్థ సంచలన చర్యకు పూనుకుంది. ముడి సరుకు కొరతపై మోదీ సర్కార్ ఎంతకీ స్పందించని దరిమిలా ఏకంగా అమెరికా అధ్యక్షుడికే సీరం సంస్థ మొరపెట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?
బైడెన్కు పూనావాలా ట్వీట్..
కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని అమెరికా సర్కారు సడలించాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా కోరారు. ముడి సరుకు అందుబాటులోకి వస్తే తప్ప వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం సాధ్యంకాదన్నారు. ఈ మేరకు పూనావాలా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అందులో..
ఐక్య పోరాటంలో ఏకపక్ష నిర్ణయాలా?
భారత్ లో తయారావుతోన్న కొవిడ్ వ్యాక్సిన్లకు ముడి సరుకు అమెరికా నుంచే దిగుమతవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ మొదటి వారం నుంచి సదరు సరుకుల ఎగుమతిని అమెరికా, యూరప్ దేశాలు నిషేధించాయి. దీంతో సీరం సంస్థతోపాటు అమెరికా వెలుపల ఉన్న దాదాపు అన్ని (వ్యాక్సిన్ తయారు చేస్తోన్న) ఫార్మా కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల ఉత్పత్తిదారు సీరం తీవ్ర ప్రభావానికి లోనైంది. ఏప్రిల్ నెలలో ఉత్పత్తి చేయాలనుకున్న డోసుల్లో కనీసం సగమైనా అందించలేని దుస్థితిలోకి జారుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు చేసిన ట్వీట్ లో పూనావాలా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిపై ఐక్యంగా జరగాల్సిన పోరాటంలో అమెరికా ఏకపక్ష నిర్ణయాలు బాధించాయని పరోక్షంగా చురకలు వేశారు.
సీరం సీఈవో ఏమన్నారంటే..
''గౌరవనీయులైన అమెరికా అధ్యక్షులవారికి.. కరోనా వైరస్ ను ఓడించడానికి మనం చేస్తున్న పోరాటం నిజంగా ఐక్యంగా సాగాలని భావిస్తే గనుక, అమెరికా నుంచి ముడిసరుకుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని వినయంగా కోరుతున్నాను. తద్వారా టీకాల ఉత్పత్తి పెరుగుతుంది. నా అభ్యర్థనకు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే మీ ఆఫీసుకు చేరవేశాను..'' అని బైడెన్ కు చేసిన ట్వీట్ లో సీరం సీఈవో పేర్కొన్నారు. ముడిసరుకు కొరతపై గతవారం కూడా పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ''స్వయంగా నేను అమెరికా వెళ్లి, అధ్యక్ష భవనం ముందు రోడ్లపై నిలబడి ఆందోళన చేయాలన్నంతగా భావోద్వేగంలో ఉన్నాను'' అని చెప్పారు.
వ్యాక్సిన్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..
బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను మన దేశంలో విరివిగా వినియోగిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసిన 'కొవాగ్జిన్' టీకాను సైతం అందుబాటులోకి తేవడం తెలిసిందే. అయితే, ప్రస్తుతం రెండో దశ ప్రభంజనంతో కొత్త కేసులు, మరణాలు పెరగడంతో టీకాలు తీసుకునేవారి సంఖ్యా పెరిగింది, కానీ, అమెరికా నిషేధంతో ముడిసరుకు లేక వ్యాక్సిన్ల ఉత్పత్తి మందగించింది. సీరంతోపాటు భారత్ బయోటెక్ లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గడువులోగా టీకాలను అందించని కారణంగా సీరంపై ఆస్ట్రాజెనెకా న్యాయపోరాటానికి సైతం దిగింది. మరోవైపు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం టీకాల కోసం వినతులు చేస్తున్నా, కొరత లేనేలేదంటూ కేంద్రం భరోసా మాటలు చెబుతున్నది..
మోదీ సర్కారుకు అన్నీ తెలిసినా..
టీకాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సీరం సంస్థకు ముడిసరుకు కొరత, ఉత్పత్తి తగుదల, లీగల్ చిక్కులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసని, తక్షణ సాయంగా రూ.3వేల కోట్లు అడిగినా ఢిల్లీ నుంచి స్పందన లేదన్నట్లుగా సీరం సీఈవో అధర్ పూనావాలా వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఆయనే ఇవాళ అమెరికా అధ్యక్షుడికి నేరుగా ట్వీట్ చేశారు. ముడిసరుకు కొరతపై భారత ప్రభుత్వం.. అమెరికాతో చర్చలు, సంప్రదింపులు జరుపుతుందని ఎదురుచూసినప్పటికీ ఆ దిశగా కదలిక లేకపోయేసరికి సీరం సంస్థ నేరుగా ఓ దేశాధ్యక్షుడికే మొరపెట్టుకుంది. ఇంత జరుగుతున్నా, మోదీ సర్కార్ ఏం చేస్తున్నట్లు? అంటూ పూనావాలా ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీకాల ఉత్పత్తి తగ్గిపోయిందని ఫార్మా సంస్థలు చెబుతుండగా, కేంద్ర సర్కారు మాత్రం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేనేలేదని వాదిస్తున్నది. జోబైడెన్ కు పూనావాలా ట్వీట్ పై అమెరికా, భారత్ ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది.