ఆగిన కారును ఢీకొట్టిన రైలు: ఏడుగురు మృతి
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని మౌలే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్సు రైలు.. పట్టాలపై ఆగిపోయిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
గూడ్సు రైలు కావడంతో ప్రయాణికులు లేరు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఆత్మాహుతి దాడి: ముగ్గురు సైనికులు మృతి
ఆఫ్ఘనిస్థాన్లోని బల్ఖ్ ప్రావిన్స్లో ఆత్మాహుతి దాడి జరిగింది. సైన్యానికి చెందిన మినీ బస్పై జరిగిన ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. ఈ మేరకు ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునిర్ అహ్మద్ ఫర్హాద్ తెలిపారు.
దాహ్దాది జిల్లాలో ఆర్మీ వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినల్లు తెలిపారు. ఈ దాడిలో మరో 18 మంది సైనికులు గాయాలపాలయ్యారు. దాడులకు పాల్పడింది తామేనంటూ తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు.