లాస్ ఏంజెల్స్ మాంటేరీ పార్క్లో కాల్పులు: 10 మంది మృతి, పలువురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. లాస్ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చైనీయుల లూనార్ న్యూఇయర్ వేడుకలో ఈ ఘటన జరిగింది.
ఈ కాల్పుల ఘటనలో 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరో 16 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కాల్పుల ఘటన జరిగిన సమయంలో అక్కడ వేలాది మంది ప్రజలు ఉన్నారు. మాంటేరీపార్క్ లాస్ ఏంజెల్స్ కౌంటీ. ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరం ఉంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి పెద్ద మెషీన్ గన్తో అక్కడకు చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు సమీపంలోని సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తికి చెందిన బార్బెక్యూ రెస్టారెంట్లోకి పరుగులు తీశారు. బయట ఓ వ్యక్తి తుపాకులతో కాల్పులు జరుపుతున్నాడని రెస్టారెంట్ యజమానికి వారు తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమీపంలోని డ్యాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో తరచూ ఇలాంటి కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఎప్పుడెం జరుగుతుందో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.