నిన్న న్యూజీలాండ్..నేడు నెదర్లాండ్స్ ! మరో ఉగ్ర ఘాతుకం..ప్రయాణికులపై కాల్పులు!
ఆమ్ స్టర్ డామ్: న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో సాయుధ దుండుగు ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలమైన మసీదులో జొరబడి, నరమేధాన్ని సృష్టించిన ఘటనను విస్మరించకముందే.. అదే తరహా ఉదంతం మరొకటి నెదర్లాండ్స్ లో చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ లోని డచ్ సిటీ ఆఫ్ యుట్రెక్ట్ లో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ప్రాథమికంగా అందిన సమాచారం.
నెదర్లాండ్స్ లోని డచ్ సిటీ ఆఫ్ యుట్రెక్ట్ లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. డచ్ సిటీ ఆఫ్ యుట్రెక్ట్ లోని 24 అక్టోబర్ స్క్వేర్ ట్రామ్ వే స్టేషన్ లో ఉదయం 10: 45 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు నిర్దారించారు. స్టేషన్ లో ట్రామ్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై యథేచ్ఛగా జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారని తేలింది.
వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి పోలీసులు మూడు హెలీ అంబులెన్స్ లను వినియోగించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరనేది ఇంకా తేలియ రావాల్సి ఉంది. స్థానిక పోలీసులు దీన్ని ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు.
క్రైస్ట్ చర్చ్ మారణహోమంలో 50 మంది అమాయకులు బలి అయ్యారు. ఈ ఘటన మిగిల్చిన దిగ్భ్రాంతి నుంచి, విషాదం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా తేరుకోలేదు. అదే సమయంలో, నెదర్లాండ్స్ లో కూడా అదే తరహా కాల్పుల ఘటన చోటు చేసుకోవడం నివ్వెర పరుస్తోంది.