వరుస రాకెట్ దాడులతో వణికిన సిటీ: గ్రీన్జోన్పై: ఇండిపెండెన్స్ డే నాడు ఉగ్రవాదుల ఘాతుకం
కాబుల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్న వేళ.. ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ రాకెట్ల దాడులతో వణికిపోయింది. కొద్ది నిమిషాల వ్యవధిలో వరుసగా నాలుగు రాకెట్లు కాబూల్లోని గ్రీన్జోన్ ప్రాంతాలపై దూసుకెళ్లాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. విదేశీ రాయబార కార్యాలయాల భవనాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటోన్న సమయంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
వేడెక్కిన అమెరికా: మిచెల్ ఒబామా ఎంట్రీ: ట్రంప్ రాంగ్ ప్రెసిడెంట్: ఓట్ అనే నెక్లెస్తో
ఈ రాకెట్ దాడుల ప్రభావం.. ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలను కొనసాగించడంపై చూపొచ్చని అంటున్నారు. ఈ దాడులకు తామే పాల్పడినట్లు ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ గానీ, మిలిటెంట్ గ్రూప్ గానీ ప్రకటించుకోలేదు. దీన్ని ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ప్రాథమికంగా ఓ ప్రకటన చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు కాబుల్లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో నాలుగు రాకెట్ల, మోర్టల్ షెల్స్ ద్వారా ఈ దాడులకు పాల్పడినట్లు ఆఫ్ఘన్ అంతర్గత భద్రత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు.
ప్రత్యేకించి- విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న గ్రీన్ జోన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగించినట్లు అధికారులు నిర్ధారించారు. విదేశీ రాయబార అధికారులు, ఆఫ్ఘన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాసం ఉంటోన్న వజీర్ అక్బర్ ఖాన్ మార్గం, పరిసర ప్రాంతాలపై రాకెట్లను సంధించినట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లోని నాటో ప్రధాన కార్యాలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆప్ఘనిస్తాన్ వ్యాప్తంగా వివిధ జైళ్లల్లో శిక్షను అనుభవిస్తోన్న 320 మంది తమ ప్రతినిధులను విడుదల చేయాలంటూ తాలిబన్లు డిమాండ్ చేయడాన్ని ఆప్ఘన్ ప్రభుత్వం తిరస్కరించిన రోజుల వ్యవధిలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
పైగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్న వేళ.. పేలుళ్లతో దద్దరిల్లిపోయింది కాబుల్ సిటీ. ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ఆస్తినష్టం భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. వజీర్ అక్బర్ ఖాన్ మార్గంలో పార్క్ చేసి ఉంచిన వాహనాలు ఈ పేలుళ్ల ధాటికి ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తారిక్ అరియన్ తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యగానే తాము భావిస్తున్నామని అన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారెవరనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు.