ఈమె నలుగురు పిల్లల తల్లి.. ప్రతిరోజూ అర్థరాత్రి వీధుల్లో సైకిల్ తొక్కుతున్నారు.. ఎందుకు?
అందరూ నిద్రపోయే వేళలో, నిశిరాత్రిలో నలుగురు పిల్లల తల్లి లియోన్ హచిన్సన్ ఎడిన్బరో వీధుల్లో సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు.
ఆమె రోజుకు 10 గంటల సేపు ఇదే పనిలో ఉంటారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా వర్చ్యువల్ టర్ఫ్ క్రీడను ఆడుతున్న మరో 297,000 మంది ఆటగాళ్లతో పోటీ పడుతున్నారు. ఆమె వయసు 51 సంవత్సరాలు. ఆమె ఒక పియానో టీచర్.
వీరంతా వీలైనన్ని ఎక్కువ జోన్లలో పరుగు పెట్టడం వలన కానీ, సైక్లింగ్ చేయడం వలన కానీ, లేదా నడవడం వలన కానీ పాయింట్లు సంపాదిస్తారు.
ఆమె అలా సైకిల్ తొక్కుతూ తెల్లవారే సరికి చారిత్రాత్మక సమాధులు, చీకటి వీధుల్లో తేలుతూ ఉంటారు.
ఆమె నిబద్దతతో ఈ ఆటను ఆడి 317 గంటల్లో 2,200 కిలోమీటర్లు పూర్తి చేయగలిగారు. అందుకు గాను ఆమెకు నవంబరులో సిల్వర్ మెడల్ లభించింది.
లియోన్ 17 సంవత్సరాల పాటు పిల్లలను పెంచిన తర్వాత తన కోసం తాను ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నారు. ఆమె పిల్లలకు ఇప్పుడు 8, 13, 15, 17 సంవత్సరాల వయస్సు.
"నా గురించి నాకు చాలా గర్వంగా ఉంది. సిల్వర్ పతకం పొందటానికి నేను చాలా కష్టపడ్డాను" అని ఆమె చెప్పారు.
"నేనెప్పుడూ ఆశను వదులుకోను. నాలో తలెత్తే భయానక ఆలోచనలతో సంఘర్షిస్తున్నప్పుడు కానీ, నా బైక్ మీద కూర్చుని ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు కానీ, నాకెదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి అలవాటు పడ్డాను"
"ఇది నాకు వ్యక్తిగతమైన విజయం కూడా. నలుగురు పిల్లలను చూసుకుంటూ, ఉద్యోగం చేస్తూ , ఈ క్రీడలో స్కాట్లాండ్ ని మొదటి సారి ప్రపంచ మ్యాప్ పై నా వలన స్థానం దక్కడం నన్ను చాలా ఉద్వేగానికి గురి చేసింది" అని ఆమె అన్నారు.
ఈ ఆటను స్వీడన్లో కనిపెట్టారు. ఈ మెడల్ సాధించిన నార్డిక్ దేశాలకు చెందని వారిలో లియోన్ తొలి వ్యక్తి అని ఆమె చెప్పారు.
"నాకు చాలా సంతోషంగా అనిపించింది. నన్ను అభినందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చాలా సందేశాలు వచ్చాయి" అని ఆమె చెప్పారు.
- లాక్డౌన్లో ఆన్లైన్ పాఠాలు.. జుగాడ్ ట్రైపాడ్తో ప్రశంసలు అందుకున్న టీచర్
- సైకిల్ జ్యోతి: బిహార్లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
లియోన్ ఆమె జీవితాన్ని మరింత క్రమబద్ధం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
"నా రోజు వారీ ప్రణాళికతో పాటు నేనెక్కడికి వెళుతున్నానో తెలుపుతూ పిల్లల కోసం ఒక డైరీని పెట్టాలని అనుకుంటున్నాను".
"కొన్ని సార్లు నేను స్కూలు నుంచి పిల్లలను తీసుకుని వచ్చే పరిస్థితిలో ఉండను. అలాంటి సమయాల్లో నేను స్థానికంగా పిల్లలను చూసుకునే వారిని గాని, ఇరుగు పొరుగు వారికి కానీ, లేదా స్నేహితులకు గాని ఫోన్ చేసి చెబుతాను".
లియోన్ భర్త ఆమెకు ఇంటి పనుల్లో, వంట, షాపింగ్ లాంటి వాటివి చేయడంలో చాలా సహాయకారిగా ఉంటారని చెప్పారు.
"నేను ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడం కోసం ఐటి రంగంలో కెరీర్ వదిలిపెట్టాను. కానీ, నాలుగు నెలల క్రితం నేను తిరిగి నాకు ఇష్టమైన పనులు చేయాలని సంకల్పించుకున్నాను" అని చెప్పారు.
"17 సంవత్సరాల పాటు ఇల్లు నిర్వహించిన తర్వాత నా కోసం నేను సమయం తీసుకోవాలని అనుకున్నాను. కొన్ని సార్లు నాకు బయటకు వెళ్లాలని అనిపించలేనప్పుడు కూడా ఆ మానసిక సంఘర్షణను ఎదుర్కొని, బయటకు వెళ్లేదానిని. కానీ, ఇప్పుడు విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది" అని చెప్పారు.
"ఇలా చేయడం వలన నేనేమిటో తెలుసుకోగలిగాను. ఇది నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది".
ఈ ఆటలో భాగంగా ఎడిన్బరో అంతా తిరుగుతూ ఆ ప్రాంతం గురించి, లోథియన్ల గురించి కూడా తెలుసుకున్నానని చెప్పారు. అలాగే, అంతకు ముందు వరకు ఉన్నాయని తెలియని ప్రాంతాలను కూడా కనిపెట్టగలిగానని చెప్పారు.
"మొదట్లో సమాధులు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో దెయ్యం వెంటాడుతున్నట్లు అనిపించేది. కానీ, అదంతా మన ఆలోచనలోనే ఉందని, అనవసర ఆందోళనకు కారణాలే లేవని నెమ్మదిగా తెలుసుకున్నాను. చాలా వరకు ఆ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి".
"నేను ఒక ప్రాంతంలోకి పూర్తిగా అడుగు పెట్టక ముందే వెనక్కి ఎలా రావాలో కూడా ఆలోచిస్తాను" అని చెప్పారు.
అన్నిటి కంటే పెద్ద సమస్య కుక్కలు వెంట పడినప్పుడే అని చెప్పారు.
- ''లాక్డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా''
- కరోనావైరస్ లాక్డౌన్: హైదరాబాద్లో ఉండలేక... ఇంటికి పోలేక వలస కార్మికుడి ఆత్మహత్య
కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఆమె డాన్బర్ , వెస్ట్ లోథియన్ , గ్లాస్గో, డూండీ, ఫాల్ కిర్క్, స్టర్లింగ్, లివింగ్స్టన్, రథో , బ్రాక్స్ బర్న్ కూడా సైక్లింగ్ చేశారు.
అలా లియోన్ 1.405 పాయింట్లను సంపాదించారు.
ఇవి బంగారు పతకం సాధించడానికి 50,000 పాయింట్లు తక్కువ. మరో సారి డిసెంబరులో ఆమె సిల్వర్ సాధించడానికి దగ్గరలో ఉన్నారు.
అంటే, ఆమె ప్రతీ రోజు సైక్లింగ్ చేయవలసి ఉంటుంది.
ఈ ఆటను అందరూ అజ్ఞాతంగానే ఆడతారు. కానీ, వారందరికీ ఒక మారు పేరు ఉంటుంది. లియోన్ కార్క్ లో జన్మించారు.
ఆమె నిక్ నేమ్ ఫియర్ గ్లాస్. అంటే ఐరిష్ భాషలో పచ్చటి గడ్డి అని అర్ధం.
ఈ టర్ఫ్ ఆడటానికి ఒక వ్యూహం ఉంటుంది. ఈ ఆటగాళ్లు ఒకరి నుంచి ఒకరు జోన్లను దొంగిలించవచ్చు. దాని వలన వివిధ సమయాల్లో అదనపు పాయింట్లు కూడా సంపాదించవచ్చు.
"ఈ స్వచ్చంద క్రీడను స్వీడన్ లో మిలిటరీ హెలికాఫ్టర్ పైలట్ ఆండ్రియాస్ పంటెసో, సైమన్ సిక్స్ట్రామ్ అనే ప్రోగ్రామర్ కలిసి కనిపెట్టారు.
ఇది ముందు పిల్లలను లక్ష్యంగా చేసుకుని తయారు చేశారు. కానీ, దీనిని ఎక్కువగా 40 - 50 సంవత్సరాలు ఉన్న వారు ఆడటం మొదలు పెట్టారు.
లియోన్ విశేష ప్రతిభ కనబరిచారని ఆండ్రియాస్ అన్నారు. అందరు టర్ఫర్లు ఆమెలా ఉండరని కూడా అన్నారు.
"ఇందులో కేవలం దూరాలు ప్రయాణం చేయడం మాత్రమే కాదు. ఈ ఆటలో ఏ దిక్కు పడితే ఆ దిక్కు వైపుకు మొదలుపెట్టడానికి కూడా లేదు" అని ఆయన అన్నారు.
ఎక్కువ పాయింట్లు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, అనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని జోన్లకు పరిమితం కావడం వలన, ఇతరులు మీ దగ్గర నుంచి తీసుకోలేనంత వరకు టేక్ ఓవర్ల వలన కూడా పాయింట్లు సంపాదించవచ్చు" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- ఆంధ్రప్రదేశ్: రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)