విద్యార్థుల ఆందోళన: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎత్తివేత
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కొంతమందికి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
షేక్ హసీనా దశాబ్ద కాలం పాలనలో అతి పెద్ద ఆందోళన రిజర్వేషన్లను ఎత్తివేయాలనేదే. రాజధాని ఢాకా వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. రోడ్ల పైకి భారీగా విద్యార్థులు, ఉద్యోగార్థులు తరలి వచ్చారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఢాకా యూనివర్సిటిలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎంతోమంది గాయపడ్డారు.
ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ల విధానం ప్రకారం ప్రభుత్వ రంగంలో 56 శాతం ఉద్యోగాలు స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు, మహిళలకు, జాతిపరమైన మైనార్టీలకు, దివ్యాంగులకు, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి కేటాయించారు. ఈ కోటాను పది శాతానికి తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రత్యేక గ్రూపులకు చెందిన వారు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారని, మిగతా వారు 94 శాతం ఉండగా 44 సాతం ఉద్యోగాల కోసం పోటీ పడాల్సి వస్తుందని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు రిజర్వేషన్ వద్దని కోరుకుంటున్నందున దానిని రద్దు చేస్తున్నట్లు హసీనా పార్లమెంటులో ప్రకటించారు. విద్యార్థులు వెంటనే ఆందోళన విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంగా, ఢాకా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘర్షణలు, వైస్ ఛాన్సులర్ నివాసంపై దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. దాడులు, విధ్వంసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.