బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ ఘనవిజయం..నాల్గవ సారి ప్రధానిగా షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. దీంతో షేక్ హసీనా నాలుగో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు మాత్రం ఎన్నికలు మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఇందులో 18 మంది మృతి చెందగా 200 మందికి తీవ్రగాయాలయ్యాయని వారు అన్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ప్రధాన ప్రతిపక్షం వ్యాఖ్యానించింది.
మొత్తం 300 స్థానాలున్న బంగ్లాదేశ్లో అధికార అవామీలీగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 267 స్థానాల్లో విజయం సాధించిందని ఆ దేశ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక విపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేతృత్వంలోని నేషనల్ యూనిటి ఫ్రంట్ గత 12 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది. ఈ సారి కేవలం 8 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. ఇదిలా ఉంటే ఈసీ ఎన్నికలను రద్దు చేసి తిరిగి మధ్యంతర ప్రభుత్వం కింద ఎన్నికలను నిర్వహించాలని ఓయిక్యా ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ ఎన్నికల్లో అన్నీ అవకతవకలే జరిగాయని ఎక్కడా న్యాయబద్దంగా జరగలేదని ఆరోపించారు మాజీ లాయరు ఫ్రంట్ ఛీఫ్ కమల్ హొసేన్.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా జైలుపాలయ్యాక బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బాధ్యతలను ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలాంగిర్ తీసుకున్నారు. ఈ ఎన్నికలు అప్రజాస్వామిక పద్ధతిలో జరిగాయని ధ్వజమెత్తారు. పక్షపాతంతో వ్యవహరించే ప్రభుత్వం కింద ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవని మరోసారి రుజువైందని మీర్జా మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రధాని షేక్ హసీనా గోపాల్ గంజ్ నుంచి పోటీ చేయగా... ఆమెకు 2,29,539 ఓట్లు వచ్చాయని... ఆమె ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అభ్యర్థికి 123 ఓట్లు మాత్రమే వచ్చినట్లు ఈసీ ప్రకటించింది.