భారత్ టూ పోర్చుగల్ : 400 ఏళ్ల క్రితం ఈ నౌక మునిగింది... అందులో ఏమున్నాయో తెలుసా..?
పోర్చుగల్ : ప్రపంచంలో కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతుంటాయి. ఎప్పుడో రాజుల కాలం నాటి వస్తువులు తవ్వకాలలో బయటపడటం, ఒక దగ్గర తప్పిపోయిన వస్తువులు మరో ప్రాంతంలో దర్శనమివ్వడంలాంటివి అద్భుతాలు పత్రికల్లో చదువుతుంటాం. లేదా టీవీల్లో వాటిగురించి వచ్చినప్పుడు చూస్తుంటాం. అలాంటిదే మరొక విషయం వెలుగు చూసింది. ఎప్పుడో 400 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఓడ తిరిగి పురావస్తుశాఖ అధికారుల కంటపడింది. ఈ ఓడకు మన దేశానికి సంబంధం ఉంది. ఇంతకీ ఆ సంబంధం ఏమిటో చూద్దాం....
400 ఏళ్ల క్రితం భారత దేశం నుంచి మసాలా దినుసుల లోడ్తో ఓ భారీ నౌక పోర్చుగల్కు బయలుదేరింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ సమీపంలో ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఇక దీని కథ ముగిసింది అనుకున్న సమయంలో పురావస్తు శాఖ అధికారుల కంటపడి మళ్లీ వార్తల్లో నిలిచింది . నౌక పేరు అయితే తెలియదుగానీ ఇది పోర్చుగల్కు చెందిన నౌకగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఇది 16వ శతాబ్దం కానీ 17వ శతాబ్దానికి కానీ చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. 1575 శతాబ్దం నుంచి 1625 మధ్య ఈ నౌక మునిగి ఉంటుందని అధికారులు చెప్పారు. నౌక మునిగిన సమయంలో ఇది భారత్ నుంచి మసాలా దినుసులతో వస్తోందని వెల్లడించారు. ఆ సమయంలో భారత్ పోర్చుగల్ మధ్య వాణిజ్య సంబంధాలు చాలా బలంగా ఉండేవని వారు పేర్కొన్నారు.
సముద్రంలో 40 అడుగుల కింద ఈ నౌకను కనుగొన్నారు అధికారులు. ఈ నౌక లోపలికి వెళ్లి చూడగా... డైవర్లకు మసాలా దినుసులు, కాంస్య ఫిరంగులు, చైనాలో తయారైన మట్టి పాత్రలు, గవ్వలు లభించాయని చెప్పారు. గవ్వలు అప్పట్లో కరెన్సీలా వినియోగించేవారని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. పురావస్తు శాఖ వేరే ప్రాజెక్టుపై సముద్రంలో పరిశోధనలు చేస్తుండగా వారికి ఈ నౌక కనిపించింది.
Wreck of 400-year-old spice trade ship found off coast of Portugal in 'discovery of a decade' https://t.co/dIRbVh6f5i pic.twitter.com/zrPYEKl7U8
— The History Press (@TheHistoryPress) September 25, 2018
400 ఏళ్ల తర్వాత సముద్రంలో ఈ నౌక కనిపించడాన్ని డిస్కవరీ ఆఫ్ డికేడ్గా అభివర్ణించారు అండర్వాటర్ ఆర్కియాలాజికల్ సర్వే సైంటిఫిక్ డైరెక్టర్ జార్జ్ ఫ్రైర్. పోర్చుగల్ చరిత్రలోనే ఇప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు ఇలాంటి నౌకను కనుగొనలేదని తెలిపారు. అంతేకాదు నౌకలోని వస్తువులన్నీ పదిలంగా ఉన్నాయని వాటికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని వివరించారు. ఈ నౌక కనుగొనడం ద్వారా చరిత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం లభించిందని మరో శాస్త్రవేత్త అన్నారు. నౌకలు ఎక్కువగా మునిగిపోయే ప్రాంతాలకు టాగస్ నది పెట్టింది పేరని మరో నౌక మునిగడంతో ఇది మరోసారి రుజవైందని పోర్చుగల్ సాంస్కృతిక శాఖ మంత్రి లూయిస్ మెండిస్ అన్నారు.