అద్భుతం: 9 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన నౌక తిరిగి ప్రత్యక్షమైంది
కొన్ని ఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ కొన్నేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. 2009లో పసఫిక్ మహాసముద్రంలో తప్పిపోయిన ఓ భారీ నౌక తిరిగి దక్షిణ మయన్మార్ తీరంలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన స్థానిక మత్స్యకారులు షాక్కు గురయ్యారు. అప్పటి వరకు సముద్రంలో చేపలు పడుతున్న వీరికి ఒక్కసారిగా సముద్రంలో నుంచి తేలుతూ భారీ నౌక కనిపించింది. పోనీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. లోపలెవరైనా ఉన్నారేమోనని దగ్గరికి వెళ్లి చూడగా పడవ మొత్తం ఖాళీగా ఉంది. అందులో సరుకుకానీ మనుషులు కానీ లేరు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... 2009లో పసఫిక్ మహాసముద్రంలో "శామ్ రతులంగి పీబీ 1600" అనే భారీ నౌక తప్పిపోయింది. అయితే దక్షిణ మయన్మార్లోని తామసీయెట్టా గ్రామంలోని సముద్ర తీరంలో ప్రత్యక్షమైంది. 2009లో తైవాన్ తీరంలో ఇది చివరిసారిగా కనిపించింది. ఈ భారీ నౌక పొడవు 177మీట్లరుండగా... 27.91 మీటర్లు వెడల్పుతో ఉంది.
దీని బరువు 26వేల 510 టన్నులుగా తెలుస్తోంది. అయితే స్థానిక మత్స్యకారులకు ఆగష్టు 30న కనిపించిన ఈ నౌకలో ఎవరూ లేరు. కనీసం సరుకు కూడా లేదు. మయన్మార్ నేవీ కూడా ఈ భారీ నౌకను తనిఖీ చేసి విస్మయానికి గురిచేసింది. అయితే పడవ మాత్రం పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే నౌక మిస్ అవ్వడంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. చిట్టగాంగ్లోని నౌక వ్యర్థాల ఫ్యాక్టరీ నుంచి ఈ నౌక మిస్ అయ్యిందని అది తేలుకుంటూ మయన్మార్ తీరం వైపు వెళ్లిందని కొన్ని పత్రికలు కథనాలు ఇచ్చాయి. అయితే ఇలా ఒక భారీ నౌక మిస్ అయి తిరిగి ప్రత్యక్షం అవడం తొలిసారి కాదు. 2015లో 11 ధ్వంసమైన పడవలు మృతదేహాలతో జపాన్ తీరంలో ప్రత్యక్షమయ్యాయి.