చంద్రయాన్ 2 ప్రయోగానికి మద్దతిస్తున్న పాకిస్థానీలు...పాక్ మంత్రికి గట్టిగానే గడ్డి పెడుతున్నారుగా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. ఒక్క భారత దేశమే కాదు.. ప్రపంచంలోని దేశాలన్నీ ఇండియా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 2 వైపు చూశాయి. ఆఖరి వరకు పోరాటం చేసిన విక్రమ్ లాండర్ తో కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో భారత శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఇక తాజాగా విక్రమ్ లాండర్ చంద్రుడిపై ఉన్నట్లుగా గుర్తించారు. భారతదేశం ఈ ప్రయోగంలో ఫెయిల్ అయిందని పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పాకిస్తానీలు మంత్రిని తిట్టిపోస్తున్నారు . ఎవరికి తోచినట్లు వారు భారతదేశం చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటూ వివేకవంతంగా మాట్లాడుతున్నారు .
పాకిస్తానీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెప్తున్న పాకిస్థానీలు
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రతి ఒక్కరూ చంద్రయాన్ మిషన్ ల్యాండింగ్ చివరి నిమిషంలో సిగ్నల్స్ కు అందకుండా పోవటంతో నిరాశ చెందారు . అయితే పోయింది సిగ్నల్ మాత్రమేనని నమ్మకం కాదని భారతీయులంతా ఇస్రోకు వెన్నుదన్నుగా నిలిచారు.ప్రపంచంలోని దేశాలన్నీ ఇస్రో చేసిన ప్రయోగాన్ని అభినందిస్తుంటే.. పాక్ మంత్రి మాత్రం అవాకులు చవాకులు మాట్లాడారు .
చేతకాకపోతే కామ్ గా కూర్చొవాలిగాని ఇలా చేయడం ఎందుకని, భారత్ లాంటి పేదదేశం రూ. 1000 కోట్ల రూపాయలను చంద్రయాన్ పేరుతో తగలేసిందని పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నాడు.దీంతో భారతదేశంలోని నెటిజన్లు ఆయనపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇక పాకిస్తానీలు చాలామంది భారతదేశం చేసిన ఈ ప్రయోగంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు పాకిస్తానీలు చంద్రయాన్-2 ప్రయోగం పై, పాకిస్తానీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతున్నారు.
పాకిస్తాన్ స్పేస్ సైన్స్ లో దశాబ్దాల వెనుకబాటుతనం తో ఉందని మండిపాటు
పాకిస్తానీలుగా మేమంతా సిగ్గుపడుతున్నామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఫవాద్ చౌదరి అసహనంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక ఇండియా చేసినటువంటి ప్రయోగం చాలా గొప్ప ప్రయోగమని ఇండియాకు ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్తున్నారు పాకిస్థానీయులు. ఇక అంతే కాదు ఇండియా మూన్ మిషన్ మీద చేసిన పాక్ మంత్రి వ్యాఖ్యలు తప్పని ఇది సాంకేతికంగా సాధించిన విజయమని మరి కొందరు పాకిస్థానీయులు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ విషయంలో దశాబ్దాలుగా వెనుకబాటుతనం తో ఉందని, ఇండియాను ఎద్దేవా చేసే బదులు స్పేస్ సైన్స్ మీద పరిశోధనలు జరిపి అద్భుతాలు సాధించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికైనా పాకిస్తాన్ మేల్కోవాలని హితవు పలుకుతున్నారు. ఇక పాకిస్తాన్ శాస్త్రసాంకేతిక రంగాలలోనూ, స్పేస్ సైన్స్ లోనూ పెట్టాల్సిన దృష్టిని మరచి ఎప్పటికీ ఇండియా పై విమర్శల వర్షం గుప్పించడం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఆయుధాల యుద్ధం కాదు, భారత్ సాధించిన అభివృద్ధి అంటూ చురకలు అంటించిన పాకిస్థానీ కాలమిస్ట్
ఇక ఓ కాలమిస్ట్ అలీ మొయిన్ నవాజ్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ లో చంద్రుడు భూమి నుండి మూడు లక్షల 84 వేల 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక భారతదేశం తాను చేసిన ప్రయోగంలో చివరి రెండు కిలోమీటర్ల దూరం లో ఫెయిల్ అయింది. 0.0005463% ఉంటే అది మార్జిన్. 10 బిలియన్ల లో వారు చంద్రునికి దగ్గరగా ఉన్న రోవర్ ను సాధించగలిగారు. మేమింకా 73 బిలియన్ లు ఖర్చుపెట్టిన పెషావర్ బి ఆర్ టీ ని తయారు చేయలేక పోయాము. ఇది ఆయుధాల యుద్ధం కాదు, భారత్ సాధించిన అభివృద్ధి అంటూ చేసిన ట్వీట్ కు పాకిస్తానీ ల నుండి చాలా మంచి మద్దతు వచ్చింది.
ఎవరూ చేయని సాహసం ఇండియా చేసింది.ఇండియా చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకోవాలని హితవు చెప్తున్నారు పాకిస్థానీలు .
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ కు చివాట్లు .. ఇండియాకు సపోర్ట్
ఇండియా ఇప్పటికే స్పేస్ సైన్స్ లో అద్భుతమైన ప్రగతిని సాధించింది . మార్స్ మీదకు ఉపగ్రహాలను పంపుతున్నది.దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెడుతున్నది.భారత్ చేస్తున్న ప్రయోగాలను మెచ్చుకోవాలి లేందంటే సైలెంట్ గా ఉండాలని నెటిజన్లు పేర్కొన్నారు.ఇండియా నుంచే కాదు అటు పాక్ నెటిజన్లు కూడాసైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ ను చివాట్లు పెడుతున్నారు.చంద్రునిపై దిగేందుకు భారత్ సాహసం చేసిందని, వీలయితే భుజం తట్టాలి.. వారి నుంచి స్ఫూర్తి పొందాలి.. ఇలా విమర్శలు చేయడం ఏంటని విమర్శిస్తున్నారు.సొంత దేశం నుంచే విమర్శలు వస్తుండటంతో పాక్ ప్రభుత్వం అయోమయంలో ఉంది.