ఉద్యోగులు టార్గెట్లు అందుకోలేదని ఈ కంపెనీ వారికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా..?
సాధారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే యాజమాన్యాలు విధించే లక్ష్యాలు అలా ఉంటాయి. వాటిని అందుకోవడంలో చాలామటుకు ఉద్యోగులు విఫలమవుతుంటారు. అలాంటి సమయాల్లో వారి పై అధికారుల నుంచి మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఆ సందర్భంలో నచ్చినవాళ్లు అదే కంపెనీలో కొనసాగుతారు... నచ్చని వాళ్లు కంపెనీని వదిలి మరో కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతారు. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం టార్గెట్లు చేరుకోని తమ ఉద్యోగస్తులకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
టార్గెట్ అందుకోలేదో అంతే సంగతులు
చైనాలో చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగస్తులపై కఠినంగా వ్యవహరిస్తుంటాయి. ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చి కొంత సమయం కేటాయించి ఆ గడువులోగా లక్ష్యాలను చేరుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తాయి. అయితే చాలామంది ఎంప్లాయిస్ ఈ టార్గెట్లను అందుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. దీంతో వారికి బోనస్లు కానీ, వేతనంలో పెరుగుదల కానీ ఉండదు. ఇదే చైనాలోని ఓ కంపెనీలో తమ ఉద్యోగులు ఇచ్చిన టార్గెట్లను అందుకోలేకపోతే వారికి శిక్ష విధిస్తున్నారు. అందేంటంటే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఉద్యోగులు తమ మోకాళ్లపై పాకుతూ వెళ్లాలి.
నడిరోడ్డులో మోకాళ్లపై సిబ్బందిని నడిపించిన యాజమాన్యం
ఇలా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు టార్గెట్లను రీచ్ కావడంలో విఫలమై మోకాళ్ల మీద పాకుతూ వెళుతున్న వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారికిచ్చిన ఇయర్ ఎండ్ టార్గెట్లను అందుకోవడంలో విఫలమైనందుకే ఈ శిక్ష విధించారని అక్కడి ఉద్యోగులు చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యారు. టార్గెట్లు అందుకోలేని ఉద్యోగులంతా తమ మోకాళ్లపై పాకుతూ వెళుతుండగా వారిని రోడ్డుపై వెళుతున్న పాదాచారులు చూసి జాలిపడ్డారు. వారందరికి ముందు ఒక వ్యక్తి కంపెనీకి సంబంధించిన జెండాతో నడుచుకుంటూ వారిని గైడ్ చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది.
వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజెన్లు
ఉద్యోగులు ఇలా నడిరోడ్డుపై శిక్ష అనుభవిస్తుండటం ఓ పోలీసు దృష్టికి రావడంతో ఆయన జోక్యం చేసుకుని ఆపాల్సిందిగా కంపెనీ యాజమాన్యాన్ని కోరాడు. అప్పటికే ఈ వీడియో ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్లలో వైరల్ అయ్యింది.ఇది చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై దుమ్మెత్తిపోశారు. ఉద్యోగులను ఇలా వేధించడం తగదని ఆ కంపెనీ యాజమాన్యానికి బుద్ధి రావాలంటే సంస్థ శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ భారం నెత్తిన వేసుకుని పనిచేస్తున్న ఉద్యోగులను ఇలా మానవత్వం లేకుండా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. చైనాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కరువైందని , మానవత్వ విలువలు లేకుండా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఇంకొందరు మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చైనా పరువుపోయేలా ఈ యాజమాన్యం వ్యవహరించిందని.. ఇంతకంటే చైనా నుంచి ఏమి కోరుకోగలమని మరికొందరు ట్వీట్ చేశారు.