ఐసిస్ షాకింగ్: మిచెల్లీని వ్యభిచారిణిగా, అణ్వాయుధాల కొనేందుకు ప్లాన్
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను వ్యభిచారానికి బ్రాండ్గా వారు పేర్కొన్నారు.
అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వాటి ప్రకారం... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన పత్రిక దబీక్ తొమ్మిదవ ఎడిషన్లో ఇది వచ్చింది. 'స్లేవ్ గర్ల్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్' అనే ఆర్టికల్లో వారు మిచెల్లీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆర్టికల్ను జీహాదీ గ్రూప్కు చెందిన ఉమ్ సుమయ్యా అల్ ముజహిరా రాసింది. అందులో.. మిచెల్లీ ఒబామా ఖరీదు దినార్లో మూడో వంతు కంటే ఎక్కువ కాదని రాసింది.
పాక్ అణ్వాయుధాల కొనుగోలుకు ఐసిస్ ప్రణాళిక
ఇస్లామిక్ స్టేట్ తన ఖజానాలోని లక్షల డాలర్లు ఉపయోగించి అణ్వాయుధాలు పొందేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాకిస్తాన్ నుంచి ఏడాదిలోగా దీనిని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ అణ్వస్త్రాన్ని అమెరికా పైనే ప్రయోగించేందుకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ఐసిస్ పేర్కొంది.
ఐసిస్ అధికార పత్రిక దబిక్లో ది పర్ఫెక్ట్ స్టోర్మ్ పేరిట కథనం వచ్చింది. ప్రపంచ ఉద్యమాన్ని సృష్టించేందుకు మధ్య ప్రాశ్చ్య, ఆఫ్రికా, ఆసియాలలోని ఇస్లామిక్ బందాలను ఏకీకృతం చేసే అవకాశాలను ఐసిస్ ప్రతిపాదిస్తున్నట్లు కథనం పేర్కొంది.
బ్రిటీష్ జర్నలిస్టు జాన్ కాంట్లీ రాసినట్లుగా చెప్తున్న ఆ వ్యాసం ఐసిస్ మిలిటెంట్ సంస్థ ఆన్లైన్ ఇంగ్లీషు మ్యాగజైన్ దబిక్ తాజా సంచికలో వచ్చింది. ఏడాదిలోగా తొలి అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి ఐసిస్ తమ బొక్కసంలో ఉన్న కోట్లాది డాలర్లను ఉపయోగించుకుంటుందని కూడా ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ అనేక మంది పాశ్చాత్యులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లుగా తమ వద్ద బందీగా ఉన్న బ్రిటీష్ ఫోటో జర్నలిస్టు కాంట్లీని తన ప్రచారం కోసం ఆ సంస్థ తరచూ ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా ఆ అణ్వస్త్రాన్ని ఐసిస్ సంస్థ ఎలా సంపాదించుకుంటుందో కూడా వివరించారు.
అణ్వస్త్రాన్ని సంపాదించడానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ బ్యాంకుల్లో మూలుగుతున్న వందల కోట్ల డాలర్ల సొమ్మును ఉపయోగించుకుంటుందని, పాకిస్తాన్లోని తమ సంస్థ కార్యకర్తల ద్వారా ఒక అఫీసర్కు లంచం ఇచ్చి అణ్వస్త్రాన్ని సంపాదిస్తుందని, ఆ తర్వాత లిబియా, నైజీరియా, మెక్సికో మీదుగా అమెరికాలోకి దాన్ని తరలిస్తుందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.