పాకిస్తాన్కు అమెరికా షాక్: ఈ సారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా..?
పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పాక్కు అమెరికా భద్రతాపరమైన ఆర్థిక సహాయం చేయలేమని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వ్యవహారంపై అమెరికా విసుగెత్తి పోయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ అమెరికాకు ఎలాంటి సహాయం చేయలేదంటూ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు అబోటాబాద్లో ఆశ్రయం కల్పించి తమకేదీ తెలియనట్లు నటించిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం రావడం చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్పై అమెరికా కన్నెర్ర
పాకిస్తాన్ పై అమెరికా కొన్ని రోజులుగా కన్నెర్ర చేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. పాకిస్తాన్కు భద్రతాపరమైన ఆర్థిక సహాయాన్ని ట్రంప్ కట్ చేశారు. ఇది దాదాపు 1.66 బిలియన్ అమెరికా డాలర్లు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి కల్నల్ రాబ్ మానింగ్ ప్రకటించారు. పాకిస్తాన్తో అమెరికా ఎంతో విసిగి వేశారిపోయిందని అందుకే భద్రతా పరమైన ఆర్థిక సహాయంను రద్దు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డిఫెన్స్ ఉన్నతాధికారిగా పనిచేసిన డేవిడ్ సిడ్నీ తెలిపారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఉగ్రవాదులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించరాదని పాకిస్తాన్ను అమెరికా పదే పదే కోరుతూ వచ్చింది. అయినప్పటికీ పాక్ వినకపోవడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సిడ్నీ తెలిపారు.
ఉగ్రవాదంతో ప్రజలు అల్లాడిపోతున్నారు: అమెరికా
అమెరికా కోరికను తప్పకుండా అమలు చేస్తామని పాకిస్తాన్ నాయకులు అప్పటికప్పుడు తల ఊపారని కానీ వాస్తవంగా ఉగ్రవాదులను అణిచివేయడంలో విఫలమయ్యారని అసలు దాని సంగతే మరిచారని సిడ్నీ తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విసిగిపోయి ఈ కఠిన నిర్ణయం చేసినట్లు సిడ్నీ తెలిపారు. పాకిస్తాన్లో ప్రజలు ఉగ్రవాదం బారిన పడి నలిగిపోతున్నారన్న అంశాన్ని అమెరికా విస్మరించడంలేదు కానీ... పాక్ ప్రజలు ఉగ్రవాదంతో ఎలా బాధపడుతున్నారో కనీసం గుర్తించి వారికి సహాయం చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలని అమెరికా కోరుతోందని మరో విశ్లేషకుడు తెలిపారు.
తాలిబన్ల కార్యకలాపాలకు పాక్ నుంచే వెళుతున్న నిధులు
ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఇప్పటికే చాలా కోల్పోయింది. అదే సమయంలో తమ పొరుగుదేశాలపై పాక్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తుంటే పాకిస్తాన్ చూస్తూ ఉండిపోవడం సరైన పద్దతి కాదని అమెరికా చెబుతోంది. తాలిబన్ , లష్కరే తోయిబాతో పాటు పొరుగుదేశాలపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలని అమెరికా పాకిస్తాన్ను కోరుతోంది. ఇప్పటికీ తాలిబన్లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు పాక్ నుంచే వెళుతున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందని అమెరికా చెబుతోంది. అంతేకాదు పాకిస్తాన్లో తాలిబన్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని కూడా అమెరికా ఆరోపణలు చేసింది. తాలిబన్లపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్ఘానిస్తాన్లో శాంతి త్వరలో నెలకొంటుందని అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నతాధికారి జాల్మే ఖలీల్జాద్ను తాలిబన్లతో శాంతి చర్చల కోసం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపే రంగంలోకి దించారు. ఇది ఇటు ఆఫ్ఘానిస్తాన్ అటు పాకిస్తాన్లకు మేలు చేకూరుస్తుందని అమెరికా భావిస్తోంది.
ఉగ్రవాదంపై పాక్ రియాక్ట్ అయి ఉంటే భారత్ నుంచి లబ్ధి చేకూరేది: అమెరికా
పాకిస్తాన్ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుని పొరుగుదేశమైన భారత్తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే భారత్ నుంచి కూడా ఆర్థిక పరమైన సహాయం ఆ దేశానికి అందేదని అమెరికా అభిప్రాయపడింది. అమెరికా పాకిస్తాన్ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతూ వస్తున్నాయి. గతేడాది ఆగష్టులో ఓ సమావేశం సందర్భంగా ట్రంప్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిందని అన్నారు. ఇలా అయితే చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్లో 300 మిలియన్ అమెరికా డాలర్లు ఆర్థిక సహాయాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.