మతం కాదు మనుషులే ముఖ్యం: సలాం అని టీచర్ అంటే జైశ్రీరామ్ అని విద్యార్థులు అంటారు
కరాచీ: అక్కడ మతాలు వేరు కానీ మనుషులు ఒక్కటే. ఒకరు సలాం అంటే మరొకరు జైశ్రీరామ్ అంటారు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ చదువు చెప్పే టీచరమ్మ ముస్లిం అయితే... పాఠాలు వినే విద్యార్థులు హిందువులు. ఉదయాన్న స్కూలుకు వచ్చి సలాం అని టీచర్ విద్యార్థులను పలకరిస్తే... అందుకు విద్యార్థులు జైశ్రీరామ్ అని బదులిస్తారు. ఇంతకీ ఆ స్కూలు ఎక్కడుందో మీకు తెలుసా...? అక్కడ ఎన్ని హిందూ కుటుంబాలు ఉన్నాయో తెలుసా..? ముస్లిం మెజార్టీ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులు అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలుసా...? కానీ ఇప్పుడు మీరు చదవబోయే వాస్తవ కథలో మాత్రం ఇలాంటివేవీ కనిపించవు. మెజార్టీ ముస్లింలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు మాత్రం చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో బస్తీ గురు ప్రాంతం ఉంది. అక్కడ కొన్ని హిందు కుటుంబాలు నివసిస్తుంటాయి. వారి పిల్లలకు చదువు చెప్పేందుకు ఆనం అనే ఓ టీచర్ ఆ ప్రాంతానికి వస్తుంటుంది. హిందువుల కోసం వారి పిల్లలకోసం చదువుకునేందుకు స్కూలు లేకపోవడంతో ఆ బస్తీలో ఉన్న ఆలయాన్నే స్కూలుగా మార్చుకున్నారు. ఆనం అనే ఈ టీచర్ ప్రతిరోజు ఆలయానికి వెళ్లి అక్కడి హిందువుల పిల్లలకు పాఠాలు బోధిస్తుంటుంది. ఆమె సలాం అని అంటే పిల్లలంతా జైశ్రీరామ్ అంటారని చెబుతోంది. అయితే తనకు మతంతో పనిలేదని పిల్లలకు చదువు చెప్పడం తనకెంతో తృప్తినిస్తుందని చెబుతోంది ఆనం.
ఇక ఆ ప్రాంతంలో 80 నుంచి 90 వరకు హిందూ కుటుంబాలుంటాయి. ఇరుకైన ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. క్లాసులు చెప్పడం అయిపోయాకా.. ఆనం అక్కడి హిందు సెటిలర్ల పిల్లలతో కబుర్లు చెబుతూ ఉంటుంది. ఇతరులకు తాను పనిచేసే స్కూలు ఒక హిందు ఆలయంలో ఉంటుందని చెప్పగానే వారు ఆశ్చర్యానికి గురవుతుంటారని ఆనం చెబుతోంది. ఆలయంలోని ప్రధాన ప్రాంగణంలో పిల్లలకు క్లాసులు చెబుతున్నట్లు ఆనం చెప్పారు. ఆలయం గోడలకు ఇరువైపులా హిందూ దేవుళ్ల ప్రతిమలుంటాయని చెప్పారు. ఇక ఆ ప్రాంతం చుట్టు మెజార్టీ ముస్లింలు ఉంటారు కాబట్టి ఎప్పుడూ వారి కళ్లు ఈ చిన్న సెటిల్మెంట్ ఏరియాపైనే ఉండేవని చెప్పారు. ఇప్పటికే వారిని ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా చాలా ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి హిందువులు ఖాళీ చేయకపోవడంతో వారి ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలు కూడా వెలుగు చూశాయని శివ ధరణి అనే వ్యక్తి చెప్పారు.
ఇక ఈ మధ్యనే ఆ ప్రాంతానికి అక్కడి అధికారులు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం హిందువులు ఉంటున్న ప్రాంతంలో మసీదు కట్టాలని ఒక వ్యక్తి చెప్పడంతో ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతం వివాదాస్పదంగానే మారింది. ముస్లింలు ఉండే ప్రాంతంలో హిందువులు ఉండటాన్ని ఒప్పుకోమని పలువురు కబ్జారాయుళ్లు ముస్లిం మతపెద్దలకు చెప్పి హిందువు కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరిఫ్ హబీబ్ అనే సామాజిక కార్యకర్త తెలిపారు. అతనే అక్కడ స్కూలు నడపాల్సిందిగా ఆనంను తీసుకొచ్చారు. హిందువుల పిల్లలకు తను క్లాసులు చెప్పడం అక్కడ చుట్టుపక్కల నివాసముండే ముస్లింలకు నచ్చదని తనపై పలుమార్లు ఒత్తిడి కూడా తీసుకొచ్చారని ఆనం చెప్పింది.
ఆడపిల్లలు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమ పిల్లల వద్దకే ఆనం అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన టీచర్ వచ్చి పాఠాలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి హిందూ కుటుంబాలు. పాఠాలు చెప్పే సందర్భంలోకానీ, ఇతర సమయాల్లో కానీ ఎప్పుడూ మతపరమైన అంశాలు పిల్లలతో మాట్లాడనని ఆనం వెల్లడించింది. దీని బదులుగా... వివిధ సబ్జెక్టులు చెబుతానని అందులో కూడా మత ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతానని ఆనం చెప్పింది. వారిని ఎంతగా అయితే తాను గౌరవిస్తుందో... అదే గౌరవం హిందు కుటుంబాల నుంచి తనకు లభిస్తుందని ఆనం చెప్పుకొచ్చింది. మెజార్టీ ముస్లింలున్న దేశంలో హిందువులతో కలిసి ప్రయాణించడం ఒక మంచి అనుభవం అని ఆమె పేర్కొంది.