సైన్యానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు!
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు మహిళా గెరిల్లాలను వారి మర్మాంగాల్లో కాల్చి చంపాలంటూ తన సైనికులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గత వారంలో కొంతమంది మాజీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి రోడ్రిగో ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు వాషిగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఓ కథనంలో పేర్కొంది. 'సైనికులకు చెప్పండి, మేయర్ నుంచి ఓ కొత్త ఆదేశం వస్తోందని.. మేం మిమ్మల్ని చంపం, జస్ట్ మీ మర్మాంగంలో కాలుస్తాం..' అంటూ రోడ్రిగో డ్యుటెర్టె వ్యాఖ్యానించారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె ఇలా నోరుపారేసుకోవడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఆయన.. పౌరులైనా సరే తుపాకులతో కనిపిస్తే కాల్చి పారేయాలని తన సైన్యాన్ని ఆదేశించారు. పొరపాటున పౌరులను చంపేసినా చట్టబద్ధంగా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు.
ఇంకోసారి ఓ క్రీడా టోర్నీలో మాట్లాడుతూ తలలు తెగనరుకుతున్న ఉగ్రవాదులకంటే తాను 50 రెట్లు అధిక కిరాతకుడినని చెప్పుకున్నారు. సజీవంగా దొరికితన తీవ్రవాదుల కాలేయాలను ఉప్పు, వెనిగర్తో వేయించుకుని తింటానంటూ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో ఏకంగా ఆయన్నే దూషించిన చరిత్ర రోడ్రిగోది. మరో సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కి మూన్పైన అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
తాజాగా ఆయన మహిళా తిరుగుబాటుదారులను ఉద్దేశించి ఇలా నోరుపారేసుకున్నారు. దీనిపై ఆ దేశంలోని హక్కుల పరిరక్షణ కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతంలో పలుమార్లు నోటికిష్టమొచ్చినట్లు మాట్లాడి ఆ తరువాత నేనేదో సరదాగా కామెంట్ చేశానని చెప్పిన సందర్భాలూ లేకపోలేదు.
దేశంలో డ్రగ్స్ మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా పోలీసులను ఆదేశించిన ఆయన ఆ నరమేధంలో దాదాపు నాలుగు వేలమంది నిరుపేదలను కాల్చేసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. అయితే ఇవన్నీ కాకి లెక్కలేనని, నిజానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఆ దేశంలోని ఉద్యమకారులు చెబుతుంటారు.
ఈ మారణ కాండపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాథమిక విచారణ ప్రారంభించింది. గత శుక్రవారం దీనిపై దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మాట్లాడుతూ.. తనపై మోపబడిన నేరారోపణలపై నిరభ్యంతరంగా విచారణ జరపొచ్చని, తాను జైలుకెళ్లడం కంటే మరణించడాన్నే ఇష్టపడతానని వ్యాఖ్యానించారు.