అది మరవకముందే!: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
కొలరాడో రాష్ట్రం థోర్న్టన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్లో కాల్పులు కలకలం రేపాయి.
వాషింగ్టన్: న్యూయార్క్ రాష్ట్రంలోని మ్యాన్హట్టన్లో ట్రక్కు బీభత్సం జరిగి 24గం. గడవకముందే మరో దారుణం చోటు చేసుకుంది. కొలరాడో రాష్ట్రం థోర్న్టన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్లో కాల్పులు కలకలం రేపాయి.
సబ్అర్బన్ డెన్వర్లోని వాల్మార్ట్ మాల్లో కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మాల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Recommended Video
మాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచారంపై నిషేధం విధించారు. స్థానికులెవరూ అటువైపు వెళ్లవద్దని చెప్పారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
సుమారు ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిగి ఉండవచ్చునని అన్నారు. మరోవైపు స్థానిక ఛానెళ్లు మాత్రం 30 రౌండ్ల దాకా కాల్పులు జరిగాయని చెబుతుండటం గమనార్హం. కాల్పుల సమయంలో.. మాల్లో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేశారని మార్ట్ ఉద్యోగి ఒకరు తెలిపారు. 9 మంది గాయపడ్డారని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.