బ్రిటన్ పార్లమెంట్పై ఉగ్రగురి: బీభత్సం, 4గురు మృతి, దుండగుడి కాల్చివేత
లండన్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బ్రిటన్ పార్లమెంటు బయట దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో 12 మందికి గాయాలయ్యాయి. సభ జరుగుతున్న సమయంలో ఈ తుపాకీ కాల్పులు జరగడం గమనార్హం.
లండన్: లండన్ నగరం ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. బ్రిటన్ పార్లమెంటును లక్ష్యంగా చేసుకొని ఓ అగంతకుడు ఉగ్రదాడికి తెగబడ్డాడు. పార్లమెంటుకు కూతవేటు దూరంలో వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై ప్రారంభమైన అగంతకుడి బీభత్సం పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అతనిని కాల్చి చంపడంతో ముగిసింది.
బుధవారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పార్లమెంటు మెయిన్ గేట్ నుంచి పార్లమెంటులో ప్రవేశించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నిస్తూ, అక్కడి పోలీసు అధికారిపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు.
మరో అధికారిపైనా దాడి చేయబోతుండగా పోలీసులు కాల్పులు జరిపి ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇది ఉగ్రవాద ఘటనగానే భావిస్తున్నట్లు స్కాట్లాండ్యార్డ్ పోలీసులు తెలిపారు.
ప్రధాని థెరిసా, ఎంపీలు సురక్షితం
అప్పుడే పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వస్తున్న బ్రిటిష్ ప్రధాని థెరిసా మేను కారులో సురక్షితంగా తరలించారు. తక్షణం అత్యవసర సేవల హెలికాప్టర్ను కూడా రంగంలో దింపారు. ప్రధాని సురక్షితంగానే ఉన్నారని ఆమె కార్యాలయం ప్రకటించింది.
ఇదే సముదాయానికి చేరువగా మరో ఘటన చోటు చేసుకొంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు పలువురు పాదచారుల్ని పొట్టనపెట్టుకొంది. కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఉంటారనీ, అనేక మంది గాయాలపాలయ్యారనీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కారు ఆ తర్వాత బ్రిటిష్ దిగువసభ భవంతిని పక్కనుంచి ఢీకొంది.
రెండు దాడుల్నీ ఒకరే చేశారా, వీటిలో మొత్తంమీద ఎంతమంది పాల్గొన్నారనేది తెలియరాలేదు.
కొద్దిసేపు పార్లమెంటులోనే ఎంపీలు
ఈ ఘటనల దరిమిలా పార్లమెంటు సమావేశం అర్థంతరంగా ముగిసిపోయింది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎంపీలంతా పార్లమెంటు భవనంలోనే కొంతసేపు బందీలు మాదిరిగా నిరీక్షించాల్సి వచ్చింది. వెస్ట్ మినిస్టర్ భూగర్భ స్టేషన్ను మూసివేశారు.
పార్లమెంటు భవనం ఉన్న ప్రాంతాన్ని దిగ్బంధం చేసినప్పుడు పలువురు పాఠశాలల పిల్లలూ, పర్యాటకులూ చిక్కుకుపోయారు. ఈ ఘటన నేపథ్యంలో లండన్లో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు పార్లమెంటు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
400 మంది సభ్యులు
పార్లమెంటు ఎదుట కాల్పులు, పేలుడు సంభవించిన సమయంలో సమావేశాలు జరుగుతున్నాయి. ఘటనా సమయంలో పార్లమెంటులో 400 మంది సభ్యులు ఉన్నారు. దీనిని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు.