లాక్డౌన్..ఇటలీలో బతుకు దుర్భరం: సూపర్ మార్కెట్ల మీద పడి లూటీ చేస్తోన్న జనం..!
రోమ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రకటించిన లాక్డౌన్.. ఇటలీలో పరిస్థితులను మరింత దుర్భరం చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి 10 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయిన ఇటలీని లాక్డౌన్ మరింత కుంగదీసింది. చాలారోజులుగా ఇటలీలో జనజీవనం స్తంభించింది. నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి డబ్బుల్లేక ఇటాలియన్లు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆహార పదార్థాలను కొల్లగొడుతున్నారు.
దీనికోసం స్థానికులు సూపర్ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి సిసిలీలో ఈ తరహా వాతావరణం నెలకొన్నట్లు ఇటలీకి చెందిన లా రిపబ్లిక్కా డెయిలీ వెల్లడించింది. సిసిలీలో నెలకొన్న భయానక పరిస్థితులపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సిసిలీలోని ఓ టాప్ సూపర్ మార్కెట్ పాలెర్నోను స్థానికులు దోచుకున్నారని పేర్కొంది.
దీన్ని నియంత్రించడానికి పాలెర్నో సహా సిసిలీలోని కొన్ని ప్రధాన సూపర్ మార్కెట్ల వద్ద ప్రభుత్వం పోలీసులను మోహరింపజేసినట్లు తెలిపింది. ఇటలీలో కరోనా వైరస్ మృతుల సంఖ్య అత్యంత ఆందోళనకరంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో.. లాక్డౌన్ను మరి కొంతకాలం పాటు కొనసాగించడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అదే జరిగితే- సామాన్యల జీవనం మరింత దుర్భరమౌతుందని స్పష్టం చేసిందా కథనం.
Recommended Video
మృతదేహాలను ఖననం చేయడానికి శవపేటికలు కూడా దొరకట్లేదని, ఫలితంగా కొన్ని చోట్ల సంప్రదాయనికి విరుద్ధంగా అంత్యక్రియలను నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఈ నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల సిసిలీ సహా ఈ స్టేట్లోని ఇతర ప్రాంతాల్లో కూడా స్థానికులు ఆహారం దొరక్క అల్లాడుతున్నారని, ఈ పరిస్థితులు సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయని లా రిపబ్లిక్కా డెయిలీ అభిప్రాయపడింది. యూరోపియన్ యూనియన్లో మూడో ధనిక దేశంగా పేరున్న ఇటలీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ఊహించలేదని పేర్కొంది.