ఈ బార్ చాలా ఇంట్రెస్టింగ్ గురూ: ఎటు చూసినా డబ్బులే..ఈ కథ ఏమిటో చూడండి..!
ఫ్లోరిడా: ఫ్లోరిడా నగరంలో సియెస్టా కీ ఓయెస్టర్ అనే ఓ బార్ ఉంది. ఈ బార్కు ఎంతో చరిత్ర ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బార్ అక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కస్టమర్లు అంతా ఒక డాలరు లేదా రెండు డాలర్లు లేదా తమకు తోచినంతగా ఈ బార్ గోడలకు కానీ , ఇతర చోట్ల కానీ స్టాపుల్ చేసి వెళతారు. అదేదో ఆచారంలా ఇది గతకొన్నేళ్లుగా సాగుతోంది.
గోడలకు సీలింగ్కు డాలర్లు
సియెస్టా బార్ అంటే అక్కడ ఎంతో పాపులర్. గత నెలలో డజన్ల సంఖ్యలో పనిచేసే ఉద్యోగులు బార్ పైకప్పులో, గోడలకు ఉన్న డాలర్లను తీసే పనిలో పడ్డారు. ఎంత తీసినా డబ్బులు బయటకు వస్తూనే ఉన్నాయి. బార్కు వచ్చిన కస్టమర్లు అంతా బిల్లులు చెల్లించి ఆ తర్వాత వెళుతూ వెళుతూ బార్ గోడలకు లేదా సీలింగ్లకు డాలరు నోటును పిన్ చేసి వెళ్లారు. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసి లెక్కిస్తే దాదాపు 14వేల డాలర్లకు చేరింది.
డోరియన్ తుఫాను బాధితుల కోసం
ఆ డబ్బును బయటకు తీసిన యాజమాన్యం ఓ మంచి పనికోసం వినియోగించేందుకు పూనుకుంది. బహామాస్ను గత నెలలో డోరియన్ తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను దెబ్బకు ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. సర్వం కోల్పోయారు. ఈ తుఫాను బారిన పడిన కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. తమవారిని డోరియన్ తుఫాను దూరం చేసిందని అపార నష్టాన్ని మిగిల్చిందని ఆ ప్రాంత బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
డబ్బులను తీసేందుకు నెలరోజులు కష్టపడ్డ ఉద్యోగులు
సీన్ కట్ చేస్తే ఆ తుఫాను బాధితులకు ఈ సియెస్టా బార్ యాజమాన్యం తమ కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బును విరాళంగా అందజేయనుంది. కొన్నేళ్లుగా బార్ సీలింగ్లో, గోడలకు ఇతర ప్రాంతాల్లో ఉన్న డబ్బులను బయటకు తీసేందుకు బార్ ఉద్యోగులు చాలా కష్టపడ్డారని బార్ యజమానురాలు క్రిస్టిన్ హేల్ తెలిపారు. ఎందుకంటే నోట్లు ఏమాత్రం చిరిగినా కష్టమే. అందుకే చాలా జాగ్రత్తగా బయటకు తీశారని ఆమె చెప్పారు.
ఈ ఆచారం వెనక చిన్న కథ
16 ఏళ్ల క్రితం ఈ బార్ను ప్రారంభించినట్లు చెప్పిన క్రిస్టిన్... అప్పటి నుంచే కస్టమర్లు ఇలా డాలర్ నోటుపై తమకు తోచినేది రాసి పిన్ చేసి వెళ్లిపోయేవారని చెప్పింది. అయితే ఉదయం సముద్రంలో వేటకు వెళ్లే ముందు మత్స్యకారులు తమ బార్కు వచ్చి ఇలా డాలర్ లేదా రెండు డాలర్లు గోడకు లేదా సీలింగ్కు పిన్ చేసి వెళ్లేవారని క్రిస్టిన్ తెలిపింది. మధ్యాహ్నం వేట నుంచి వచ్చిన తర్వాత వాళ్లు మద్యం సేవిస్తారని అలా ఈ ఆచారం ప్రారంభమైనట్లు క్రిస్టిన్ చెప్పింది.
మంచి పనికోసం ఉపయోగిస్తాం
ఇలా పోగైన డబ్బును ప్రతి మూడేళ్లకు తీసి స్థానిక చారిటీ సంస్థలకు విరాళంగా అందజేస్తామని చెప్పారు. ఈ డబ్బుతో అనాథలకు అవసరంలో ఉన్నవారికి అందజేస్తామని చెప్పింది క్రిస్టిన్. అయితే ఈ సారి వచ్చిన డబ్బును డోరియన్ తుఫాను బాధిత కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించినట్లు బార్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే ఒక మంచి పనికోసం బార్ యాజమాన్యం డబ్బులను సేకరిస్తోందన్న విషయం తెలుసుకున్న కస్టమర్లు మరింత డబ్బులను పిన్ చేయడం మొదలు పెట్టారు.