భారత్, చైనా బలగాలు వెనక్కి - నెలరోజుల ప్రతిష్టంభనకు తెర- చర్చలకు వీలుగా....
నెల రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్దితులకు తెరదించేందు వీలుగా ఇరు దేశాలూ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇవాళ్టి నుంచి మిలిటరీ స్ధాయి చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్-చైనా తమ బలగాలను వ్యూహాత్మకంగా వెనక్కి రప్పిస్తున్నాయి. చర్చలకు సానుకూల సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ చర్య మారిన పరిస్ధితులకు అద్దం పట్టేలా ఉందని ఇరుదేశాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
బిగ్ న్యూస్: తోకముడిచిన చైనా సైన్యం.. లదాక్ నుంచి వెనక్కి.. మరోసారి కమాండర్ల చర్చలు..
మంచు కరుగుతోంది.... బలగాలు వెనక్కి...
భారత్-చైనా బలగాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇరుదేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇవాళ్టి నుంచి మిలటరీ స్ధాయి చర్చలు ప్రారంభమవుతున్న తరుణంలో గల్వాన్ లోయతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కొన్ని సెక్టార్లలో బలగాలను ఇరుదేశాలూ ఉపసంహరించుకుంటున్నాయి. గల్వాన్ లోయలోని పీపీ 14. 15, 17 ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరు దేశాలకు చెందిన దాదాపు 1500 మంది సైనికులు.. కిలోమీటరు నుంచి 1.2 కిలోమీటర్ల మేర వెనక్కి మళ్లినట్లు తెలుస్తోంది.
నేటి నుంచి చర్చలు...
నెలరోజులుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను చల్లార్చేలా, పూర్తిగా అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకునే లక్ష్యంతో ఇరుదేశాల మిలిటరీ అధికారుల మధ్య ఇవాళ్టి నుంచి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి పలు దఫాలుగా ఉంటాయని తెలుస్తోంది. హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు సంబంధించి మేజర్ జనరల్ స్ధాయి అధికారులు ఇవాళ చర్చల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున మేజర్ జనరల్ లిన్ లుయీ ఇందులో పాల్గొంటున్నారు. జూన్ 6న వీరిద్దరూ ఇదే అంశంపై ఆరుగంటల పాటు చర్చించారు.
Recommended Video
విడతల వారీగా బలగాలు వెనక్కి...
భారత్-చైనా మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమవుతున్న తరుణంలో మూడు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరుగుతోంది. ఇదే కోవలో తర్వాత విడత చర్చల నాటికి మరికొన్ని బలగాల ఉపసంహరణ ఉంటుందని చెబుతున్నారు. ఇలా చర్చలు ముగిసే సరికి పూర్తిగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని ఇరుదేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే చర్చల పురోగతిని బట్టి ఇది ఉండొచ్చని మిలిటరీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. అంటే చర్చల ప్రక్రియ ముందుకు సాగే దాన్ని బట్టి బలగాల తరలింపు ఉంటుంది.