పాకిస్తాన్ లో సిక్కు యువకుడి దారుణహత్య: పబ్లిక్ గా కాల్పులు: వచ్చే నెలలో వివాహం.. !
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ప్రఖ్యాత గురునానక్ జన్మస్థలం నన్కనాలోని గురుద్వారాపై అల్లరి మూకలు దాడులు చేసిన ఘటనను విస్మరించకముందే.. అలాంటి ఉదంతమే మరొకటి నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఓ సిక్కు యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాకిస్తాన్ లోని పెషావర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన సంభవించింది.
మృతుడి పేరు పర్వీందర్ సింగ్. 29 సంవత్సరాలు. పెషావర్ లో జర్నలిస్టుగా పని చేస్తోన్న హర్మీత్ సింగ్ సోదరుడిగా ఆయనను గుర్తించారు. భారత సంతతికి చెందిన పర్వీందర్ సింగ్ చాలాకాలం నుంచి మలేసియాలో నివసిస్తున్నారు. అక్కడ ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి. తన వ్యాపార కార్యకాలాపాలను విస్తృతం చేయడంలో భాగంగా.. కొద్దిరోజుల కిందటే ఆయన పెషావర్ కు వెళ్లారు.
వచ్చే నెలలో పర్మీందర్ సింగ్ వివాహం జరగాల్సి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఆహ్వానించడానికి పెషావర్ కు వెళ్లారు. ఆదివారం తన సోదరుడు హర్మీత్ సింగ్ తో కలిసి స్థానికంగా షాపింగ్ కు వెళ్లారు. భారత సంతతికి చెందిన యువకుడిగా గుర్తించారు. దీనితో- మొదట ఆయనతో గొడవ పడ్డారు. అనంతరం పర్వీందర్ సింగ్ పై కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో రెండు బుల్లెట్లు పర్వీందర్ సింగ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఫలితంగా ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. పాకిస్తాన్ లో మైనారిటీలుగా జీవిస్తోన్న హిందువులకు భద్రత లేదంటూ హర్మీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.