Sinabung Volcano:బద్దలైన సీనాబంగ్ అగ్నిపర్వతం.. చిమ్మ చీకటిలో ఆ గ్రామాలు
ఇండోనేషియా/సుమత్ర: ఇండోనేషియాలోని సుమత్ర దీవుల్లో సీనాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున బూడిద బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది. 16,400 అడుగుల ఎత్తువరకు అగ్నిపర్వతం నుంచి బయటకు విడుదలైన పదార్థాలు గాల్లో కలిసిపోయాయి. అయితే అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో ఎవరికీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఇండోనేషియా అగ్నిపర్వతాల పరిశోధనా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Recommended Video
బద్దలైన సీనాబంగ్ అగ్నిపర్వతం
ఇక ఈ అగ్ని పర్వతం బద్ధలు కావడంతో దీన్నుంచి విడుదలయ్యే వాయువులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అగ్నిపర్వతం ఉన్న పరిధినుంచి 5 కిలోమీటర్ల వరకు దూరంగా ఉండాలని గ్రామస్తులను ప్రభుత్వం కోరింది. గ్రామాల్లోకి లావా వచ్చి చేరే అవకాశం ఉన్నందున వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం గ్రామస్తులను ఆదేశించింది. కొన్నేళ్లుగా 30వేల మంది గ్రామస్తులను ప్రభుత్వం బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది. అగ్నిపర్వతం బద్దలవడంతో దాన్నుంచి బయటకు వచ్చిన బూడిద సుమారు 20 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని వాల్కనోస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. పలు గ్రామాలు ఈ బూడిదలో చిక్కుకుపోయాయని వివరించింది.
నాలుగు దశాబ్దాలుగా యాక్టివ్గా లేని సీనాబంగ్
ఇండోనేషియాలో చాలా అగ్నిపర్వాతాలు ఉండగా ప్రస్తుతం బద్ధలైన ఈ అగ్నిపర్వతం 4 శతాబ్దాలుగా యాక్టివ్గా లేదు. 2010లో తొలిసారిగా విస్ఫోటనం చెందిన ఈ అగ్నిపర్వతం అప్పుడు ఇద్దరిని బలిగొనింది. 2014లో మరోసారి విస్ఫోటనం చెందడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. 2016లో మరోసారి బద్ధలవడంతో ఏడుగురు మృతి చెందారు. సీనాబంగ్ అనే ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉన్న 120 యాక్టివ్ వాల్కనోస్లో ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న సీనాబంగ్ అగ్నిపర్వతం అత్యంత ప్రమాదకరంగా నిపుణులు చెబుతున్నారు.
చిమ్మచీకటిలో ఆ గ్రామాలు
సీనాబంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగానే ఆ శబ్దం ఒక ఉరుములా ఉన్నిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 30 సెకన్ల వరకు ఇది విస్ఫోటనం చెందిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా విమానాలు ఆపరేట్ అవుతున్నాయని సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ముఖానికి మాస్కులు ధరించాలని జాగ్రత్తలు చెప్పింది ప్రభుత్వం. అంతేకాదు లావా పొంగి పొర్లుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం బూడిద మొత్తం 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను కమ్మేయడంతో ఆ గ్రామాలు వెలుతురు లేక చీకటిగా మారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.