విమానంలో చెలరేగిన మంటలు: 241మంది పరుగు(వీడియో)
సింగపూర్: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానానికి సోమవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది. బోయింగ్ 777-300ఈఆర్ విమానం భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సింగపూర్లోని ఛాంగి విమానాశ్రయం నుంచి మిలాన్కు బయలుదేరింది.
రెండు గంటల తర్వాత ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా దించాల్సిందిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను పైలట్ అనుమతి కోరాడు. వారి అనుమతితో విమానాన్ని తిరిగి చాంగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విమాన కుడి రెక్క పూర్తిగా కాలిపోయిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 222 మంది ప్రయాణికులతో పాటు 19మంది సిబ్బంది ఉన్నారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరూ దిగిపోవడంతో ప్రమాదం నుంచి వారంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన చేరుకున్న ఫైరింజన్లు విమానంకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. అనంతరం మరో విమానంలో ప్రయాణికులను మిలాన్ తరలించారు.