కరోనాకే చుక్కలు చూపించారు.. వైరస్ నియంత్రణలో ఆదర్శం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్..
సింగపూర్.. దక్షిణ ఆసియాలోనే అతి చిన్నదైన ఈ ద్వీపదేశం.. సున్నా నుంచి సంపన్నదేశంగా ఎదిగింది. కేవలం 704 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, 57 లక్షల జనాభాతో ఎకానమీ పరంగా ప్రపంచంలో టాప్11వ దేశంగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ హబ్ గా విపరీతమైన క్రేజ్ పొందింది. గొప్ప పేరుకు తగ్గట్లే మొదట్లో కరోనా వైరస్ కు కూడా సింగపూర్ చుక్కలు చూపించింది. మిగతా దేశాలు లాక్డౌన్ అయిన తర్వాత కూడా.. సింగపూర్ పిల్లలు స్వేచ్ఛగా బడులకు వెళ్లగలిగారు. వైరస్ నియంత్రణలో మిగతా దేశాలన్నీ సింగపూర్ ను ఫాలోకావాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సైతం ప్రశంసించింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది..
ట్రాకింగ్ లో కింగ్..
గతేడాది డిసెంబర్ 1న చైనాలోని వూహాన్ లో తొలి కొవిడ్-19 కేసు నమోదైంది. చైనా తర్వాత వైరస్ వ్యాపించిన రెండో దేశం సింగపూర్. జనవరి 13న సింగపూర్ లో మొదటి కేసును గుర్తించారు. ఆ తర్వాత జనవరి చివరినాటికి వైరస్ అమెరికా, యూరప్ దేశాలకూ పాకింది. అందరికంటే ముందే వైరస్ ఎఫెక్ట్ అయినప్పటికీ.. రవాణా వ్యవస్థపై నూరుశాతం నిఘా, అద్భుతమైన ట్రాకింగ్ వ్యవస్థతో రోగుల్ని ముందే పసిగట్టడం, సైన్యమే మాస్కులు తయారుచేసి, ప్రజలకు ఫ్రీగా పంచిపెట్టడం తదితర చర్యల కారణంగా సింగపూర్ లో వైరస్ పెద్దగా వ్యాపించలేదు. కానీ అనుకోని రీతిలో..
ప్రధాని అనూహ్య ప్రకటన..
కోరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న కారణంగా దేశంలో నెలరోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ శుక్రవారం ప్రకటించారు. అత్యవసర సేవలు, ముఖ్యమైన బిజినెస్ వ్యవహారాలు తప్ప మిగతా వ్యవస్థలన్నీ మూతపడతాయని చెప్పారు. ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని, పిల్లలకు ఆన్ లైన్ లోనే పాఠాలు చెబుతామని తెలిపారు. అయితే మిగతా దేశాల్లా ఉన్నపళంగా లాక్ డౌన్ చేయకుండా.. నాలుగు రోజులు టైమిచ్చారాయన. ఏప్రిల్ 7 నుంచి నెల రోజులపాటు లాక్ డౌన్ అమలుకానుంది. సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి కారణమేంంటంటే..
లోకల్ వ్యాప్తి..
కరోనాను మొదట్లో సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ సింగపూర్ లో ఇప్పుడది వేగంగా విస్తరిస్తున్నది. దీనికి కారణం.. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్.. అంటే వైరస్ లోకల్ గానే వ్యాప్తి చెందుతున్నది. ‘కరోనా సెకండ్ వేవ్'గా చైనీస్ డాక్టర్లు చెబుతున్నట్లు.. రోగ లక్షణాలు బయటికి కనిపించకుండానే జనం కొవిడ్ కాటుకు గురవుతున్నట్లు సింగపూర్ అధికారులు గుర్తించారు. దీన్నే ‘అసింప్టమాటిక్' అని కూడా పిలుస్తారు. పరిస్థితి మరింతగా విషమించకముందే లాక్ డౌన్ ద్వారా వైరస్ ను నియంత్రించొచ్చన్న ఉద్దేశంతో ప్రధాని లూంగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ అక్కడ సీన్..
ఈ ఏడాది జనవరి 13నే తొలి కేసు నమోదైనప్పటికీ సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చర్యల కారణంగా ఇప్పటిదాకా మరణాల సంఖ్య 5కు మాత్రమే పరిమితమైంది. అందులో ఒకరు రెండ్రోజుల కిందటే చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1114గా ఉంది. గత రెండు రోజుల్లోనే 65 కొత్త కేసులు వచ్చాయి. అయితే వైరస్ సోకినవాళ్లలో 266 మంది చికిత్స తర్వాత కోలుకున్నారు. 24 మంది పరిస్థితి మాత్రమే క్రిటికల్ గా ఉంది.