‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు
అమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్కు చెందిన వ్యక్తి అంగీకరించాడు.
అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకంగా మారింది.
జున్ వీ యెవో అనే ఆ సింగపూర్ పౌరుడు అమెరికాలో పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ చైనా కోసం నిఘా సమాచారం సేకరిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపించారు.
మరోవైపు చైనా మిలటరీతో తనకున్న సంబంధాలు దాచిపెట్టిన ఒక చైనా రీసెర్చర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఇవి జరగడానికి ముందు చైనా తన దేశంలోని చెంగ్డు నగరంలో ఉన్న అమెరికా కాన్సులేట్ను మూసివేయింది. అమెరికాలోని హ్యూస్టన్లో చైనా కాన్సులేట్ను అమెరికా మూసివేయించడంతో ప్రతిగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా తమ దేశంలో చైనా మేధోచౌర్యానికి పాల్పడుతున్న కారణంగానే హ్యూస్టన్లోని ఆ దేశ కాన్సులేట్ను మూసివేయించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో అన్నారు.
అయితే, చైనా ఆయన ఆరోపణలను ఖండిచింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రచారం చేస్తున్న అబద్దాలలో ఇదీ ఒకటని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు.
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- చైనాలో వీగర్ ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ
మరోవైపు హ్యూస్టన్ దౌత్య కార్యాలయాన్ని మూసివేసి 72 గంటల్లోగా వెళ్లిపోవాంటూ అమెరికా విధించిన గడువు శుక్రవారంతో పూర్తయింది.
ఆ గడువు పూర్తయిన తరువాత అక్కడ అమెరికా అధికారులు కనిపించారని.. ఆ ప్రాంగణంలోకి వెళ్లేందుకు బలవంతంగా తలుపులు తెరుస్తుండడం కనిపించిందని వార్తలొచ్చాయి.
అమెరికా, చైనాల మధ్య అనేక అంశాలపై విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం వాణిజ్యం, కరోనావైరస్, హాంకాంగ్లో చైనా అమలు చేస్తున్న వివాదాస్పద భద్రతా చట్టం వంటి విషయాల్లో చైనాతో గొడవ పడుతోంది.
ఇంతకీ ఈ సింగపూర్ పౌరుడు ఎవరు?
జున్ వీ యెవో అలియాస్ డిక్సన్ యెవో శుక్రవారం ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. 2015 నుంచి 2019 వరకు చైనాకు రహస్య ఏజెంటుగా పనిచేశానని యెవో అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో ఆయన నిర్వహిస్తున్న పొలిటికల్ కన్సల్టెన్సీ ద్వారా విలువైన, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించి చైనా నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్నది ఆయనపై అభియోగం.
యెవో 2019లో అమెరికా వచ్చినప్పుడు ఆయన్ను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన చైనా రీసెర్చర్ సంగతేంటి?
తాము అరెస్ట్ చేసిన చైనా రీసెర్చర్ పేరు జువాన్ తాంగ్(37)గా చెబుతున్నారు అమెరికా అధికారులు.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేస్తున్న విషయం దాచిపెట్టి వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగంతో గత వారం నలుగురిని అమెరికాలో అరెస్ట్ చేశారు. వారిలో జువాన్ తాంగ్ కూడా ఒకరు.
కాలిఫోర్నియాలో ఆమెను అరెస్ట్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ ఆమెకు ఆశ్రయిచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని అమెరికా ఆరోపించింది.
జువాన్ తాంగ్ చైనా మిలటరీ యూనిఫాంలో ఉన్న చిత్రాలు ఎఫ్బీఐకి చిక్కడంతో ఆమె చైనా సైన్యానికి చెందిన వ్యక్తని అమెరికా గుర్తించిందని వార్తాఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
కాలిఫోర్నియా యూనివర్సిటీలో రేడియేషన్ అంకాలజీ విభాగంలో విజిటింగ్ రీసెర్చర్గా పనిచేసిన జువాన్ జూన్లో ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- వాణిజ్య యుద్ధాలు మంచివేనన్న డొనాల్డ్ ట్రంప్.. మండిపడుతున్న చైనా, ఇతర దేశాలు
చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు?
ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు అనేక కారణాలున్నాయి. కరోనా మహమ్మారికి చైనాయే కారణమని అమెరికా అధికారులు ఆరోపించారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఆధారాలేమీ చూపకుండానే చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న ల్యాబ్లో కరోనావైరస్ పుట్టిందని ఆరోపించారు.
మరోవైపు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అమెరికా ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూ అమెరికా సైనికులే వుహాన్లోకి ఈ వైరస్ మోసుకొచ్చారన్నారు. ఆయనా నిరాధారంగానే ఈ ఆరోపణలు చేశారు.
వీటన్నిటికి ముందు నుంచే 2018లోనే రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది.
ఇవేకాకుండా చైనాలోని జిన్ జియాంగ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై ఆ దేశం అకృత్యాలకు పాల్పడుతోందనీ అమెరికా ఆరోపిస్తోంది. చైనా అక్కడి వీగర్ ముస్లింలను సామూహికంగా నిర్బంధిస్తోందని.. బలవంతంగా సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
చైనా ఈ ఆరోపణలను ఖండించడమే కాకుండా తమ దేశా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తోంది.
- చైనాకు హాంకాంగ్ 'తలనొప్పి’.. మకావు మాత్రం 'మచ్చుతునక’..
- చైనా కొత్త చట్టంపై హాంకాంగ్లో నిరసనలు.. టియర్ గ్యాస్ ప్రయోగం
హాంకాంగ్ విషయంలో..
హాంకాంగ్లో కొత్త భద్రతా చట్టాన్ని అమలు చేయడం కూడా చైనాకు అమెరికా, బ్రిటన్లతో కయ్యానికి కారణమైంది.
1997 వరకు హాంకాంగ్ బ్రిటన్ పాలనలో ఉండేది.
చైనా అక్కడ తన భద్రతా చట్టాన్ని అమలు చేస్తుండడంతో హాంకాంగ్కు తాము కల్పించిన ప్రత్యేక వాణిజ్య హోదాను అమెరికా ఉపసంహరించుకుంది.
ఈ హోదా ఉన్న కాలంలో చైనా వస్తువులపై అమెరికా సుంకాలున్నా హాంకాంగ్కు అది వర్తించేది కాదు. ఈ హోదా తొలగిస్తే హాంకాంగ్ వస్తువులపై అధిక సుంకాలు అమలవుతాయి.
చైనా భద్రతా చట్టం హాంకాంగ్కు ముప్పేనని అమెరికా, బ్రిటన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే 30 లక్షల మంది హాంకాంగ్ పౌరులకు బ్రిటిష్ పౌరసత్వం కల్పిస్తామని బ్రిటన్ చేసిన వ్యాఖ్య చైనాకు ఆగ్రహం తెప్పించింది. హాంకాంగ్లో అనేక మందికి ఉన్న బ్రిటన్ పాస్పోర్ట్ బీఎన్వోను రద్దు చేస్తామని చైనా హెచ్చరింది.
ఇవి కూడా చదవండి:
- చైనా వెళ్లిన ఇంటర్పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్లిస్ట్లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)