lockdown:సింగపూర్లో జూన్ 1వరకు, 4 వారాలు లాక్డౌన్ పొడిగింపు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సింగపూర్ లాక్డౌన్ పొడిగించింది. మరో నాలుగు వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 1వ తేదీ వరకు సింగపూర్లో లాక్డౌన్ అమల్లో ఉండనుంది. దీంతో కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయనున్నారు.
మరోవైపు మంగళవారం సింగపూర్లో 1111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 9 వేల 125కి చేరింది. వీరిలో చాలా మంది వసతి గృహాలను నిర్మించే వలసకూలీలు అని సింగపూర్ అధికారులు పేర్కొన్నారు. వైరస్ను సమూలంగా తరిమికొట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
భారత్లో రెండో దఫా లాక్ డౌన్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న దేశాలు కూడా సింగపూర్ని అనుసరించే అవకాశం ఉంది. తమ దేశం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా జూన్ 1వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్కు మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. స్వీయ నియంత్రణలో ఉంటూ.. సామాజిక దూరం పాటిస్తే చాలు. వైరస్ ఎలా వచ్చిందో తెలియనందున.. దానికి వ్యాక్సిన్ కనుక్కొవడం కష్టమవుతోంది. ఒకవేళ కనుక్కొన్నా.. కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అందుకే వైరస్ ప్రభావం ఉన్న దేశాలు లాక్ డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్నాయి.