ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే: ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ వార్నింగ్
జెనీవా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు సూచనలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని చెబుతూ కొన్ని దేశాలు లాక్డౌన్ ఎత్తివేసి తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశ ప్రభుత్వాలు ఎంత చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు లేదా బాధ్యత అనేది కొరవడుతోంది. ఇక భారత్లో అయితే అన్లాక్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా అదే సమయంలో మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Recommended Video
అచ్చెన్నాయుడికి ఊరట- ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశం...
చాలా దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో సరైన మార్గంలో పయనించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానమ్ గెబ్రేసస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనావైరస్ ప్రజలను పొట్టనబెట్టుకోవడం ఖాయం అని ఆయన తెగేసి చెప్పేశారు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కనిపించని ఈ శతృవుపై విజయం సాధించడం అసాధ్యమని అన్నారు. పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని టెడ్రాస్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 13 మిలియన్గా ఉంది. 5లక్షలకు పైగా మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం గణాంకాలు తీసుకున్నట్లయితే 10దేశాల నుంచి 80శాతం కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా రెండు దేశాల నుంచి మాత్రం 50శాతం కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో అమెరికా, బ్రెజిల్ దేశాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని టెడ్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా లాక్డౌన్ అమలు చేయాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగపు అధిపతి మైక్ ర్యాన్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అలాంటి రాష్ట్రాల్లో నియంత్రించాలంటే ఆంక్షలు చాలా కఠినంగా అమలు చేయాలని అమెరికా ప్రభుత్వానికి మైక్ ర్యాన్ సూచించారు. లేదంటే ఇది కంట్రోల్ తప్పితే మాత్రం పెను ప్రమాదం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక స్కూళ్లు ప్రారంభించడంపై ఇప్పుడప్పుడే ప్రకటనలు చేయొద్దని సూచించారు. వైరస్ పూర్తిగా తగ్గిన తర్వాతే స్కూళ్లను ప్రారంభించుకోవచ్చని సూచించారు.
ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్విసభ్య బృందం చైనాలో ఉంది. కరోనావైరస్ మొదటగా ఎక్కడ బయటపడింది, దాని పర్యవసనాలేంటనే దానిపై దర్యాప్తు చేసేందుకు వూహాన్ నగరంకు చేరుకుందని ర్యాన్ తెలిపారు.