హాంగ్కాంగ్లో మిన్నంటిన నిరసనలు: ఆ బిల్లును నిలిపివేయాలంటూ డిమాండ్
హాంగ్ కాంగ్ : హాంగ్కాంగ్లో నిరసనల వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు హాంకాంగ్ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్లను ప్రయోగించారు. చైనాకు నేరస్తుల అప్పగింత విషయంలో చట్టసభల్లో చట్టం తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. వేల సంఖ్యలో పౌరులో ఆందోళనకు దిగడంతో చట్టసభల్లో జరగాల్సిన చర్చ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆందోళనకారులు నలుపు తెలుపు దుస్తులు ధరించి తమ నిరసన తెలిపారు. ఒక్కసారిగా హాంకాంగ్ సెంట్రల్ కాంప్లెక్స్లోకి ప్రవేశించారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ బిల్లు ఉపసంహరించుకోవాల్సిందిగా నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పద్ధతినే కొనసాగించాలని ఒకవేళ బిల్లు పాస్ చేస్తే చైనా చేతిలోకి తమ జీవితాలు వెళ్లిపోతాయన్న భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే వివాదాస్పద బిల్లుపై తొలిసారి స్పందించారు సీఈఓ. హాంకాంగ్ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు లక్ష్యం లేదా ఉద్దేశం సరిగ్గానే ఉందని అన్నారు. ఆర్థిక నేరగాళ్లకు హాంకాంగ్ నగరం ఆశ్రయంగా మారకూడదనే ఉద్దేశంతోనే బిల్లును తీసుకొస్తున్నామని ఆమె స్పష్టంచేశారు. అదే సమయంలో హాంకాంగ్కు ఎప్పటికీ ద్రోహం జరగదని చెప్పారు.
ఇదిలా ఉంటే నిరసనకారులతో ఇప్పటికే అట్టుడికిపోతుండటంతో బ్రిటన్ రంగంలోకి దిగింది. నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. అంతేకాదు తమకు అత్యంత సన్నిహిత దేశాలతో కూడా చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని బ్రిటన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జెరెమీ హంట్ కోరారు. మరోవైపు హాంగ్కాంగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు చైనా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే పోలీసులపై నిరసనకారులు దాడి చేయడంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చైనా చెబుతోంది.