పార్లమెంటులో పాము... పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు
నైజీరియా: సాధారణంగా పార్లమెంటు ఎప్పుడు వాయిదా పడుతుంది. హౌజ్ ఆర్డర్లో లేనప్పుడో లేక టీ విరామంకో లేదా లంచ్ బ్రేక్ అప్పుడో వాయిదా పడుతుంది. కానీ ఓ అనుకోని అతిథి నిండు సభకు రావడంతో ఒక్కసారిగా పార్లమెంటు వాయిదా పడింది. అంతేకాదు ఆ అతిథిని చూసి అందరూ పారిపోయారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనుకుంటున్నారు.. ఓ పెద్ద పాము.
పార్లమెంటు హాలు సీలింగ్ పై నక్కిన విష సర్పం
రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో ఒక పూల్ టేబుల్లో పాము దర్శనం ఇచ్చిన ఘటన మరవకముందే నైజీరియాలో మరో పాము ప్రత్యక్షమైంది. నైజీరియా పార్లమెంటులో చర్చ సీరియస్గా జరుగుతున్న సమయంలో సభ్యులంతా సబ్జెక్ట్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఓ పాము సభలోకి ప్రవేశించింది. సెక్యూరిటీ కళ్లు గప్పి ఈ పాము లోపలికి ప్రవేశించిందంటే దీని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే సభ ప్రారంభంకంటే ముందు అది పార్లమెంటు హాలుకు ఉన్న సీలింగ్ పై నక్కి ఉన్నింది. సభ సీరియస్గా జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ పాము పై నుంచి కిందకు పడటంతో సభ్యులు పరుగులు తీశారు.
చిందులేసిన ప్రతిపక్ష సభ్యులు
పాము పై నుంచి కిందకు పడింది కానీ ... ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. బహుషా అప్పటి వరకు సభ్యుల మధ్య చర్చ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు ఉన్నింది ఆ పాముకు. ఇక పాము ఒక్కసారిగా కనిపించడంతో అప్పటి వరకు ప్రతిపక్షానికి గుర్తుకు రాని పార్లమెంటు హాలు మెయింటెనెన్స్ ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పాము వచ్చిందని సభలో రభస చేశారు. సరైన నిధులు లేకనే కనీసం పార్లమెంటును కూడా భద్రంగా చూసుకోలేని పరిస్థితి దాపురించిందని ప్రతిపక్ష సభ్యులు వాపోయారు. అంతేకాదు భవంతిలో మార్పులు చేర్పులు చేసేవరకు తాము సభకు హాజరుకాబోమని తెగేసి చెప్పేశారు.
ప్రతి లక్షమందిలో 500 మంది పాము కాటుకు గురవుతున్నారు
ఇదిలా ఉంటే ఒక పాము పార్లమెంటు హాలులోకి రావడం ఇదే తొలిసారి. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో పలు కీటకాలు కనిపించాయని కొందరు చెప్పారు. నైజీరియాలో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో 500 మంది పాముకాటుకు గురవుతున్నారు. అందులో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు పాముకాటుకు మృతి చెందుతున్నారు. అయితే పాము కాటుకు గురైతే హాస్పిటల్కు చికిత్స చేయించుకుందామని వెళ్లే వారు 10శాతం మంది కూడా లేరనే విషయం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.