నువ్వెంత నీ లెక్కెంత! రష్యా, చైనాలే: కాశ్మీర్పై అమెరికాకు పాక్ ఘాటుగా
వాషింగ్టన్: పాకిస్థాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశ హోదాపై సమీక్ష జరపనున్నట్లు భారత్ ప్రకటించింది. ఉగ్రవాదం ఎగుమతి సరకు కారాదని వ్యాఖ్యానించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం మీడియాతో మాట్లాడారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానిపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశంసల జల్లు కురిపించడాన్ని ఖండించారు. భారత్కు వ్యతిరేకంగా సాగుతున్న ఉగ్రవాదంలో పాక్ పాత్రను ఇది తేటతెల్లం చేస్తోందన్నారు. నెల 28న ఉగ్రవాద సంస్థలు పాక్లో ర్యాలీ నిర్వహించనుండటంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అంతర్జాతీయంగా ఉగ్రవాదులుగా ముద్రపడిన ముష్కరులకు అలాంటి స్వేచ్ఛ లభించడంపై ఆందోళన వ్యక్తంచేశారు.
కాగా, అమెరికా మరెంతో కాలం ప్రపంచ శక్తిగా, అగ్రరాజ్యంగా ఉండదని, కాశ్మీర్ విషయంలో అగ్రరాజ్యం వైఖరి మారకుంటే తాము రష్యా, చైనాలను ఆశ్రయిస్తామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దూత ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ అమెరికాను వాషింగ్టన్లో హెచ్చరించాడు.
యూరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఏకాకి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం అమెరికాలో కొంత మార్పు వచ్చింది. దీంతో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ కాశ్మీర్ విషయంలో అమెరికా ప్రతినిధులను కలిసి వివరించాడు.
దాదాపు గంటన్నర పాటు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినా ఆయన వాదనను అంగీకరించేందుకు అమెరికా నిరాకరించింది. దీంతో ఏం చేయాలో తెలియని పాకిస్తాన్... అగ్రరాజ్యంపై విమర్శలు గుప్పించింది. అమెరికా మేథో సంస్థ అట్లాంటిక్ కౌన్సెల్లో సంప్రదింపులు ముగిసిన అనంతరం ముషాహిద్ మాట్లాడాడు.
అమెరికా ఎంతమాత్రం ఇక ప్రపంచ శక్తిగా ఉండబోదన్నాడు. ఆ దేశం గురించి ఇక మర్చిపోవాల్సిందేనన్నాడు. ఆ దేశ ఆధిపత్యం రోజురోజుకు దిగజారిపోతోందని చెప్పాడు. భారత్, కాశ్మీర్ అంశంలో తమ దేశం వాదనను అమెరికా అంగీకరించకుంటే తాము రష్యా, చైనాలకు దగ్గరవుతామని హెచ్చరించే ప్రయత్నం చేశాడు.
దక్షిణ ఆసియాలో ఇప్పుడు చైనా కీలక దేశమని, బీజింగ్ పాత్ర ఇప్పుడు కీలకంగా మారిందని అతను వివరించాడు. అంతేకాదు మాస్కో - బీజింగ్ మధ్య స్నేహం పెరుగుతుందని చెప్పాడు. అయితే, ఆయన మాటలు అధికారికంగా కెమెరాలో రికార్డు కాలేదు. కానీ అక్కడున్న ప్రతినిధులకు వినిపించాయి. అమెరికా నుంచి మద్దతు లభించకపోవడంతో అతను తీవ్ర ఒత్తిడిలో మాట్లాడాడు. అన్ని వైపుల ఒత్తిడి ఉండటంతో అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు.