సోషల్మీడియా: ఆ దేశ యువతకు నిద్రలేకుండా చేస్తోంది!
స్టాక్హోం: ప్రపంచ వ్యాప్తంగా నేటి యువత సోషల్ మీడియాకు బానిసగా మారిపోతోంది. రోజులో ఎక్కువగా భాగం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్వీడన్ యువతపై సోషల్ మీడియా ప్రభావం మరింత ఎక్కువగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో స్వీడన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డిజిటల్ డివైస్లను ఉపయోగించడం మూలంగా స్వీడన్ దేశ పిల్లలు, యువత నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది.
ముఖ్యంగా సోషల్ మీడియానే ఆ డివైస్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం అని స్వీడన్కు చెందిన పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ టెలివిజన్ తెలిపింది. నిద్రపోవడానికి ముందు ఆ దేశంలో 82శాతంమంది డిజిటల్ డివైస్లను ఉపయోగిస్తూ వారికి నిద్రలేకుండా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఏ పనిని సమర్థంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం అని, అది కేవలం నిద్ర ద్వారానే సాధ్యం అవుతుందని చెబుతోంది. ఈ విషయం మరిచిపోయిన యువకులు, చిన్నారులు అనవసరంగా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తలదూరుస్తున్నారని పేర్కొంది.
ముఖ్యంగా వీరంతా కూడా 15 నుంచి 29 ఏళ్లలోపు వారే కావడంతో ఓ రకంగా తమ దేశానికి ఆందోళన కలిగించే విషయమని వెల్లడించింది.
అంతేకాకుండా ఐదేళ్లకిందట ఎంతబాగా నిద్రపోయామో ఇప్పుడలా నిద్రపోలేకపోతున్నామని కూడా సగం మంది యువత ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. సోషల్ మీడియా ప్రభావం మూలంగానే ఈ విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయిన స్పష్టం చేసింది.