‘భారత్తో చర్చల్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి’
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ దేశాల శాంతి చర్చల్ని కొన్ని శక్తులు అడ్డగిస్తున్నాయని పాక్ రక్షణ మంత్రి కవాజా మహ్మద్ ఆసిఫ్ ఆరోపించారు. ఆయన బుధవారం పాకిస్థాన్ రేడియోలో మాట్లాడుతూ.. ఉగ్ర దాడుల ద్వారా ఆ శక్తులు శాంతి చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నాయని అన్నారు.
అయితే వారు తమను ఎంతో కాలం అలా నిలువరించలేరని చెప్పారు. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఫోన్లో సంభాషించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వారి సంభాషణే ఇరు దేశాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణానికి నిదర్శనమన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద పీడిత దేశమని దాని మీద ఎప్పుడూ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు.
పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారత సైనిక అధికారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సైన్యం కాల్పుల్లో దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ ప్రేరేపిత, కాందహార్ హైజాక్ ఘటనకు పాల్పడిన మౌలానా మసూద్ అజ్మర్ నాయకత్వంలోని జైషే ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులేనని ఆరోపణలున్నాయి.