దావూద్తో ముంబై పోలీసులకు లింక్స్: చోటారాజన్
బాలి: ఇండియన్ గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ముంబై పోలీసుల పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. ఇండోనేషియాలో జైలులో చోటా రాజన్ ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడాడు.
దావూద్ ఇబ్రహీంకు తాను భయపడనని చెప్పాడు. ముంబై పోలీసులు తనకు తీరని అన్యాయం చేశారన్నాడు. దావూద్ ఇబ్రహీంకు, తీవ్రవాదానికి నేను వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్తో సంబంధాలున్నాయన్నాడు.
ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపిస్తే ఆ జైలుకు వెళ్తానని చెప్పాడు. ముంబై పోలీసుల పైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పాడు. ముంబై పోలీసులు తనను వేధించారని ఆరోపించాడు. వారు తన పట్ల చాలా నీచంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మిమ్మల్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలా లేక ముంబైకా అని విలేకరులు ప్రశ్నించగా... ప్రభుత్వం ఎక్కడకు తీసుకు వెళ్తే అక్కడకు పోతానని చెప్పాడు. కాగా, భారత్ పోలీసులు సోమవారం నాడు తొలిసారి చోటా రాజన్ను ప్రశ్నించారు. అతనిని మరో రెండు మూడు రోజుల్లో భారత్ తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.