తప్పయింది: క్షమాపణ కోరిన మహిళా జర్నలిస్టు
హంగేరీ: శరణార్థులపై పైశాచికంగా ప్రవర్తించిన మహిళా జర్నలిస్టు పెట్రా లాజ్లో తాను చేసింది తప్పేనని ఒప్పుకుంది. తనకు హృదయం ఉందని, జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నట్లు తెలిపింది. ఇటీవల శరణార్థులపై పైశాచికంగా ప్రవర్తించడంతో సదరు మహిళా జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో ఆమె పైవిధంగా స్పందించింది. శరణార్థులు ఆ సమయంలో తనపై దాడి చేసేందుకు వస్తున్నారన్న ఆందోళనతో మాత్రమే ఆ పని చేశానని తెలిపింది. నా వీడియో ఫుటేజ్ నేను చూశాను.
జరిగిన దానికి నిజాయతీగా క్షమాపణ కోరుతున్నాను. దీనికి పూర్తి బాధ్యత నాదే. నేనేమీ హృదయం లేని అమ్మాయిని కాను. చిన్నారిని కిందపడేసేంత దుర్మార్గురాలిని కాదు. ఏదో ఆందోళనలో అలా జరిగిపోయింది' అని చెబుతోంది.
హంగేరీలో 'ఎన్1 టీవీ'కి కెమెరా పర్సన్గా ఉన్న పెట్రా ఓ శరణార్థికి కాలు అడ్డు పెట్టగా, ఆ దృశ్యాలు ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెట్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం విడిచిపెట్టారు. ఘటన అనంతరం ఆమెను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఎన్1 టీవీ యాజమాన్యం కూడా ప్రకటించింది.
తాను చేసిన పని, ఆపై తనకు జరిగిన నష్టం, ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నాయని, ఆందోళనలో ఉన్న సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని, వందలాదిగా ప్రజలు తన వైపు దూసుకువస్తుంటే ఎంతో భయపడ్డానని, ఆ సమయంలో తెలీకుండా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది
తానిప్పుడు నిరుద్యోగిగా ఉన్న మహిళను మాత్రమేనని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని వారి పోషణ ఎలాగన్న దిగులు పట్టుకుందని వాపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రవర్తిచడం అంటే.. ఇలాగే ఉంటుందని తెలిసేలా చేసింది ఈ మహిళా జర్నలిస్టు.