కిమ్ ఓకే చెబుతారా: అధికారి కాల్చివేత ఘటనపై సంయుక్త విచారణకు దక్షిణ కొరియా డిమాండ్..
సియోల్: గత కొద్దిరోజుల క్రితం ఉత్తరకొరియా దక్షిణ కొరియా సముద్రజలాల సరిహద్దు వద్ద దక్షిణ కొరియా అధికారిని ఉత్తరకొరియా సైన్యం తుపాకులతో కాల్చి ఆపై శరీరాన్ని తగలబెట్టింది. దీనిపై దక్షిణ కొరియా భగ్గుమంది. ఉత్తరకొరియా ఇంతటి ఘాతుకానికి పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఉత్తరకొరియాను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాలో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఇటు రాజకీయంగానూ దుమారం రేపంది ఈ ఘటన. దీంతో దక్షిణ కొరియా ఉత్తరకొరియా ముందు కొత్త ప్రతిపాదన ఉంచింది. ఇరు దేశాలు కలసి ఘటనపై సంయుక్త విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
దక్షిణకొరియా అధికారిని ఉత్తరకొరియా సైన్యం కాల్చి చంపడంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్షమాపణ కోరినప్పటికీ దక్షిణ కొరియాలో ఆగ్రహజ్వాలలు తగ్గని నేపథ్యంలో మూన్ ప్రభుత్వం సంయుక్త విచారణ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం దక్షిణకొరియా జాతీయ భద్రతా మండలి సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చింది. ముందుగా అధికారిని కాల్చి ఆ పై శరీరాన్ని తగలబెట్టారని దక్షిణ కొరియా ఆరోపిస్తుండగా... ఉత్తరకొరియా మాత్రం మరోలా చెబుతోంది. తమ సరిహద్దుల్లోకి చొరబడిన వ్యక్తిని మాత్రమే తాము కాల్చినట్లు సైన్యం చెబుతోంది. అయితే దక్షిణ కొరియా ఆరోపిస్తున్నట్లుగా తాము ఆ వ్యక్తి శరీరాన్ని తగలబెట్టలేదని సైన్యం స్పష్టం చేసింది.
అయితే ఘటనపై స్పందించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... దక్షిణ కొరియా ప్రజలకు, అధ్యక్షుడు మూన్ జే ఇన్లకు క్షమాపణ చెప్పాడు. అయితే ఉత్తరకొరియా ప్రధాన ప్రతిపక్షం మాత్రం కిమ్ క్షమాపణ మనసు నుంచి రాలేదని పేర్కొంది. అంతేకాదు ఈ ఘాతుకంపై దక్షిణ కొరియా ప్రభుత్వం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అదే సమయంలో అమెరికా భద్రతా మండలిని ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని ఉత్తరకొరియా ప్రతిపక్షం కోరింది. ఇదిలా ఉంటే అధికారిని పాశవికంగా కాల్చి చంపిన ఘటనపై దక్షిణ కొరియా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
Recommended Video
దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక అధికారిని కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంటూ...అదేసమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి పట్ల చాలా మెతకగా వ్యవహరించడంపై అక్కడి ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. ఆ అధికారిని ఉత్తరకొరియా సైన్యం కాల్చి చంపడానికి ఆరుగంటలకు ముందే గుర్తించినప్పటికీ ఎందుకు కాపాడలేక పోయిందని ప్రశ్నిస్తున్నారు.