ఇదీ అసలు నిజం: కిమ్ యుద్ద కాంక్షపై బీబీసీ, 15ని.ల్లో చంపేందుకు ద.కొరియా ప్లాన్..
కేవలం 15 నిమిషాల్లోనే కిమ్ను హత్య చేసేందుకు దక్షిణ కొరియా ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.
ప్యోంగ్యాంగ్/సియోల్: ఉత్తరకొరియా వైఖరి అమెరికా దాని మిత్ర దేశాలకు అణ్వాయుధాలను అభివృద్ది చేసుకోవాల్సిన అనివార్యతను కల్పించింది. యుద్ద కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అత్యాధునిక క్షిపణులతో యుద్దానికి సన్నద్దమవుతున్నాయి.
ఇక్కడే ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. నిజానికి అణ్వాయుధాలు కలిగి ఉండటమనేది ఐరాస శాంతి ఒప్పందాలకు తూట్లు పొడిచే చర్య అయినప్పటికీ.. ఉత్తరకొరియా దుందుడు వైఖరి ఆ పరిస్థితిని ముందుకు సాగనివ్వడం లేదు. దీంతో ఆయుధ తయారీకి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ప్రపంచ దేశాలన్ని భద్రత విషయంలో మునుపటి కన్నా ఎక్కువగా దృష్టి సారించాల్సిన దుస్థితి తలెత్తింది.
సవాల్ లాంటిదే:
ఒకరకంగా ప్రస్తుత పరిస్థితి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను సవాల్ చేస్తున్న విషయమే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా చిన్న దేశాలకు ఇదొక ఆర్థిక ముప్పు లాంటిదే. అణ్వాయుధాలు కలిగి ఉన్నామని చెప్పుకోవడమే ఈరోజుల్లో దేశాల భద్రతను ప్రామాణికం చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఒకరకంగా అణ్వాయుధాలు కలిగి ఉంటేనే శక్తివంతమైన దేశంగా గుర్తిస్తారనే స్థితికి విలువలు దిగజారుతున్నాయి.
కిమ్ కోరుకున్నది అదే!:
అసలు అమెరికాతో యుద్దానికి కాలు దువ్వాల్సిన అవసరం ఉత్తరకొరియాకు ఏమొచ్చిందనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్న. బీబీసీ వ్యాఖ్యాత జాన్ సింప్సన్ పరిశీలన ఈ ప్రశ్నకు జవాబు చెబుతోంది.
నిజానికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు యుద్దం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని, కానీ పదేపదే యుద్ద హెచ్చరికలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తానో శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందుతాననేది అసలు ఉద్దేశమనేది సింప్సన్ వెల్లడించారు.
అమెరికా లాంటి అగ్ర రాజ్యాన్ని గడగడలాడించడం, కాళ్ల బేరానికి తీసుకురావడం ద్వారా ఉత్తరకొరియాను అత్యంత శక్తివంతమైన దేశంగా ప్రపంచ దేశాలు పరిగణించాలని కిమ్ భావిస్తున్నట్లుగా సింప్సన్ తెలిపారు. నిజానికి అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేంత సామర్థ్యం ఉత్తరకొరియాకు లేకపోయినప్పటికీ.. క్షిపణి ప్రయోగాలు, యుద్ద హెచ్చరికలతో అగ్రరాజ్యాన్ని తమతో రాజీపడే స్థాయికి దించాలనేది ఆ కిమ్ యోచన అని ఆయన తెలిపారు.
బీబీసీ చెప్పింది నిజమే:
బీబీసీ వ్యాఖ్యాత సింప్సన్ చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా రీసెర్చ్ స్కాలర్ పెట్రోవ్ సమర్థించారు. కిమ్ జాంగ్ అసలు ఉద్దేశం ప్రపంచదేశాలన్ని ఉత్తరకొరియాను న్యూక్లియర్ శక్తిగా గుర్తించడమేనని అభిప్రాయపడ్డారు. అమెరికా సీఐఏ అధికారి మైకెల్ మోరెల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాను నాశనం చేయగల సత్తా తమకు ఉందని చాటుకోవడమే కిమ్ జాంగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
15నిమిషాల్లో కిమ్ను చంపేందుకు?:
అమెరికాతో పాటు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ లకు కూడా అంతే స్థాయిలో ఉత్తరకొరియా నుంచి ముప్పు పొంచి ఉంది. పక్కలో బల్లెంలా మారిన ఆ దేశంతో ఈ దేశాలకు ఏళ్లుగా శత్రుత్వం కొనసాగుతోంది. ఇప్పుడు అగ్రరాజ్యానికే ఆ దేశం గురిపెట్టడంతో.. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు చేతులు కలిపాయి.
తాజాగా జపాన్ కు చెందిన నాలుగు ద్వీపాలను పేల్చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించిన నేపథ్యంలో.. ఇక కిమ్ ను ఎంతమాత్రం సహించకూడదని ఆ దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే కిమ్ను హత్య చేసేందుకు అడ్వాన్స్డ్ ఎయిర్-లాంచ్డ్ క్రూజ్ మిసైల్ను దక్షిణకొరియా మిలిటరీ అభివృద్ది చేసినట్లు ప్రచారం జరుగుతుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉత్తరకొరియా అణుపరీక్షలు జరుపుతున్న ప్రాంతాలపై కేవలం 15 నిమిషాల్లో దాడి జరిపేవిధంగా దక్షిణ కొరియా క్షిపణులను తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది.