ఆధునిక నియంత కిమ్జొంగ్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా సంచలన ప్రకటన: పెదవి విప్పని ఉత్తర కొరియా
సియోల్: ఆధునిక నియంతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కిమ్జొంగ్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన వైఖరి, దుందుడుకు చర్యలతో తరచూ వార్తల్లో కనిపించే ఆయన.. ఈ సారి తన ప్రమేయం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉంటే..తాను ఒక్కడిని ఇంకో వైపు ఉన్నాననే సంకేతాలను ఇన్నిరోజులూ ఇస్తూ వచ్చిన కిమ్జొంగ్ ఆరోగ్యం ఎలా ఉంది? అనే విషయం కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Recommended Video
ఉత్తర కొరియా నియంత కిమ్ మరణించారా? అవునంటోన్న చైనా, జపాన్ మీడియా.. ప్రత్యేక కథనాలు
కిమ్ ఆరోగ్యంపై స్పందించిన దక్షిణ కొరియా..
గుండె సంబంధ ఇబ్బందుల కారణంగా ఈ నెల 12వ తేదీన సర్జరీ చేయించుకున్న ఆయన.. మరణించి ఉండొచ్చనే వార్తలు రెండురోజులుగా విదేశీ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సర్జరీ తిరగబెట్టిందని, ఫలితంగా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టుకున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. దీనితో అందరి దృష్టీ ఉత్తర కొరియాపై పడింది. ఆయన మరణించి ఉండొచ్చనే వార్తలు వెలువడినప్పటికీ.. ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా దక్షిణ కొరియా కిమ్ ఆరోగ్యంపై సంచలన ప్రకటన చేసింది.
కిమ్ ఆరోగ్యంగా ఉన్నారంటూ..
కిమ్ అనారోగ్యం, మరణించారంటూ వచ్చిన సమాచారానికి తెర దించింది దక్షిణ కొరియా. ఆయన నిక్షేపంలా ఉన్నారని వెల్లడించింది. కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పటిదాకా ఆయనపై వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవేనని కొట్టి వేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయీ-ఇన్ విదేశాంగ విధానాల సలహాదారు మూన్ ఛుంగ్-ఇన్ తెలిపారు. సీఎన్ఎన్ మీడియాకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కిమ్ జీవించే ఉన్నారని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.
వొన్సాన్లో ఉన్నారంటూ
కిమ్ ప్రస్తుతం వొన్సాన్లో నివసిస్తున్నారని మూన్ ఛుంగ్ను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఆయన అక్కడే ఉంటున్నారని స్పష్టం చేసింది. వొన్సాన్లో కిమ్కు సంబంధించిన అనుమానించదగ్గ కదలికలేవీ చోటు చేసుకోలేదని మూన్ ఛుంగ్ వెల్లడించినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. సర్జరీ చేయించుకున్న మాట వాస్తవమేనని తేలడంతో విశ్రాంతి కోసం ఆయన వొన్సాన్లో ఉంటున్నట్లు అభిప్రాయపడింది.
పెదవి విప్పని ఉత్తర కొరియా..
ఇదిలావుండగా.. కిమ్జొంగ్ ఆరోగ్యంపై ఇంత రచ్చ జరుగుతున్నా ఉత్తర కొరియా మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కిమ్కు సంబంధించిన ఎలాంటి విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోందా దేశం. కిమ్ మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. పెదవి విప్పడానికి నిరాకరిస్తోంది. ఉత్తర కొరియా మీడియాలో కూడా కిమ్కు సంబంధించిన సమాచారమేదీ ప్రచురితం కావట్లేదు. తన వారసురాలిగా తోడబుట్టిన చెల్లెలిని కిమ్ ఎంపిక చేశారంటూ వార్తలు వచ్చాయి. దాని పట్లా ఉత్తర కొరియా స్పందించలేదు. డెయిలీ ఎన్కే అనే ఓ వెబ్సైట్ కిమ్ అనారోగ్యంపై తొలిసారిగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.