సడలింపు వేళ: కేఫ్లు కిటకిట..షాపుల ముందు రద్దీ: ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు:ఇదీ అక్కడి రిలాక్సేషన్ సీన్
సియోల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ సడలించిన వేళ.. దక్షిణ కొరియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం పునః ప్రారంభమైంది. రాజధాని సియోల్ సహా దక్షిణ కొరియాలోని పలు ప్రధాన నగరాల్లో ప్రజలు క్రమంగా రోడ్డెక్కుతున్నారు. స్వీయ నిర్బంధం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. నిత్యావసర సరుకులతో పాటు సెల్ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు.
10 వేలకు పైగా పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ బారిన పడిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. చైనాకు ఆనుకునే ఉండటంతో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది చర్చనీయాంశమైంది. దక్షిణ కొరియాలో ఇప్పటిదాకా 10,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 236 మంది మృత్యువాత పడ్డారు. 8,114 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 55 మంది పరిస్థితి విషమంగా మారింది. ఆ దేశ జనాభాలో సగటు ప్రతి 10 లక్షల మందిలో 208 మందికి వైరస్ సోకింది. ఫలితంగా నెలరోజులపాటు అక్కడ లాక్డౌన్ను విధించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల సంఖ్య క్షీణించడం వంటి కారణాల వల్ల లాక్డౌన్ను సడలించారు.
రోడ్ల మీదికి జనం..
లాక్డౌన్ నుంచి సడలింపు లభించడంతో ఇన్నిరోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో కొనసాగిన జనం.. రోడ్ల మీదకి వచ్చారు. ప్రధాన రహదారులన్నీ సందడిగా మారాయి. వాహనాల్లో తిరిగారు. పార్కుల్లో సేద తీరారు. వందలాది మంది రోడ్ల మీద తిరుగాడుతూ కనిపించింది. వారంతా ముందు జాగ్రత్త చర్యలను పాటించారు. ముఖాలకు మాస్కులు, గ్లోవ్స్ను ధరించారు. పార్కుల వంటి విశాలమైన ప్రదేశాల్లో దక్షిణ కొరియాన్లు సోషల్ డిస్టెన్సింగ్ పాటించినప్పటికీ రోడ్ల మీద ఆ పరిస్థితి కనిపించలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామిలీ పిక్నిక్కు వచ్చారు.
కేఫ్లు కిటకిట..
సియోల్లోని అన్ని టాప్ కేఫ్లు, రెస్టారెంట్లు రద్దీతో నిండిపోయాయి. సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ దుకాణాల ముందు బారులు తీరి కనిపించారు. మొట్టమొదటి యాపిల్ ఫోన్ స్టోర్ ముందు జనం క్యూలు కట్టారు. వారిలో చాలామంది యువతీ యువకులే. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ పునః ప్రారంభం అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలు, విద్యాసంస్థలను తెరవలేదు. మరి కొన్ని రోజుల పాటు వాటిపై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
ర్యాండమ్ టెస్టింగ్
కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించడానికి దక్షిణ కొరియా అధికారులు ర్యాండమ్ టెస్టింగులను నిర్వహించారు. అది కాస్తా సత్ఫలితాలను ఇచ్చిందని అంటున్నారు. ఫలితంగా- నెగెటివ్ కేసులను గుర్తించడం సులభతరమైందని అంటున్నారు. ర్యాండమ్ టెస్టింగ్స్ ద్వారా పాజిటివ్గా తేలిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం లాభించిందని చెబుతున్నారు. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత అతి తక్కువగా కేసులు నమోదు కావడంతో లాక్డౌన్ను సడలించామని వెల్లడించారు.
Recommended Video