కొరియా టెక్నాలజీ అదుర్స్: చనిపోయిన కూతురితో తల్లిని కలిపిన టీవీ షో, కదిలిపోయిన హృదయాలు
కొరియా: మన దగ్గరి వారు మనకు ఎప్పటికీ అందనంత దూరంకు వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమవుతుంది. అప్పుడెప్పుడో మరణించిన వారు తిరిగి కళ్లముందు ప్రత్యక్షమయితే... ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. ఇప్పుడు కొరియా దేశం కూడా అప్పుడెప్పుడో మృతి చెందిన బిడ్డను తల్లి ముందు ఉంచింది. ఇదెలా సాధ్యమంటారా.. అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
చనిపోయిన కూతురును కలిసిన తల్లి
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న తల్లి కూతుళ్లు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో కదా.. తల్లి కూతురుతో ఏవో కబుర్లు చెబుతున్నట్లుగా ఉంది కదూ. ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అక్కడ కూతురు లేదు. ఇప్పుడు ఆ తల్లి మాట్లాడుతున్న బిడ్డ 2016లోనే మృతి చెందింది. కానీ మృతి చెందిన కూతురు ఎలా తిరిగొచ్చిందనేగా మీ డౌటు.. అవును ఇది కేవలం కొరియా టెక్నాలజీతోనే సాధ్యమైంది. వాస్తవానికి కూతరు అక్కడ లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో ఇది సాధ్యమయ్యేలా చేసింది కొరియాకు చెందిన ఓ టెలివిజన్ షో.
2016లో చనిపోయిన కూతురు నయేన్
కొరియాలో "మీటింగ్ యూ" పేరుతో ఓ టెలివిజన్ షో పాపులర్ అయ్యింది. ముందుగా ఆ కుటుంబ విషయాలను ఈ షో ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రోగ్రాంలో పాల్గొన్న ఓ తల్లి తన కూతురును2016లో కోల్పోయినట్లు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. కూతురు పేరు నయేన్. ఇక బాధపడాల్సిన అవసరం లేదని చెప్పిన షో నిర్వాహకులు నయేన్ను ఆ తల్లిముందు ప్రత్యక్షమయ్యేలా చేశారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు, ఆడుకున్నారు అంతేకాదు తనకు ఎలాంటి బాధ లేదని కూతురు తల్లితో చెప్పడం చూస్తే పలువురి కళ్లు చెమర్చాయి. కానీ వాస్తవంగా అక్కడ కూతురు లేదు. ఇదంతా తల్లి ధరించిన ప్రత్యేక పరికరాల అయిన టచ్ సెన్సిటివ్ గ్లవ్స్, మరియు ఆడియోతో సాధ్యమైంది.
టెక్నాలజీ ఇలా పనిచేస్తుంది
తల్లి జాంగ్ జి సంగ్ వైవ్ వర్చువల్ రియాల్టీ హెడ్గేర్ ధరించింది. ఇది ధరించగానే ఆమె కళ్ల ముందు ఓ గార్డెన్ ప్రత్యక్షమైంది. ఆ తోటలో కూతురు పర్పుల్ కలర్ డ్రెస్ ధరించి నవ్వుతూ కనిపించింది. తనను ఇంతకాలం ఎంతో మిస్ అయ్యానంటూ తల్లి కన్నీటిపర్యంతమైంది. అయితే ఇక్కడ కూతురు నిజంకాదు. సాంకేతికతను వినియోగించిన కొరియన్ కంపెనీ మున్హ్వా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అచ్చం నయేన్ ముఖాన్ని, శరీరాన్ని, స్వరంను రూపొందించింది. ఇక ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా అని కూతురు ప్రశ్నించడం, తన గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అడగడం.. ఇందుకు తల్లి నిన్ను తలుచుకోని క్షణం ఉండదని చెప్పడం వంటి సన్నివేశం చూసిన పలువురు కదిలిపోయారు.
డిజిటల్ రూపంలో కూతురు నయేన్
ముందుగా డిజిటల్ రూపంలో ఉన్న నయేన్ను తాకేందుకు తల్లి కాస్త భయపడింది. కానీ నయేన్ మాత్రం తల్లిని తాకింది. జాంగ్ డిజిటల్ రూపంలో ఉన్న కూతురును తాకగానే తన కళ్ల వెంబడి కన్నీళ్లు వచ్చాయి. ఆడియెన్స్ గ్యాలరీలో కూర్చుని ఉన్న తండ్రి, సోదరుడు, సోదరి ఈ దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక నయేన్ పరుగులు తీసి ఒక పువ్వు తీసుకొచ్చి తల్లికి ఇస్తుంది. నిన్ను నేను ఇకపై బాధపెట్టునులే అమ్మా అని చిన్నారి చెబుతుంటే ఇది నిజంగా జరిగి ఉంటే బాగుండేదనిపించింది.
కదిలించిన తల్లీ కూతుళ్ల సన్నివేశం
ఇక చాలాసేపు తల్లితో ఆడుకున్న నయేన్ ఇక తను అలసిపోయినట్లు తల్లికి చెబుతూ గుడ్ బై చెప్పి నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇది తనకొక మ్యాజికల్ జర్నీ అని ఎప్పటికీ మరిచిపోలేనని తల్లి జాంగ్ చెప్పుకొచ్చింది. ఇక ఈ షోకు తాను అదే పనిగా వచ్చినట్లు చెప్పిన జాంగ్... తనలా ఎవరైనా బిడ్డలను కోల్పోయి ఉంటే వారికోసమే ఈ ప్రయత్నం చేసినట్లు తన బ్లాగ్లో రాసుకొచ్చింది. మూడేళ్ల తర్వాత చిన్నారిని మిస్ అవుతున్నాను అని చెప్పేదానికంటే తాను ఎంత ప్రేమించానో చెప్పగలిగేలా ఉంటానని తల్లి జాంగ్ బ్లాగ్లో రాసింది. ఈ షో చూసిన చాలామంది నయేన్ను గుర్తుంచుకుంటారని బ్లాగ్లో పేర్కొంది తల్లి జాంగ్.