45 ఏళ్ల తరువాత.. మళ్లీ చంద్రుడి వద్దకు.. ఇద్దరు టూరిస్టులు
2018 ఆఖరులో చందమామ మీదకు ఇద్దరు టూరిస్టులు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
హూస్టన్: చందమామ మీదకు ఇద్దరు టూరిస్టులు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2018 ఆఖరులో ఈ మూన్ టూర్ ఉంటుందని స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు.
చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్న ఆ టూరిస్టులు ఇద్దరూ ఇప్పటికే ఆ టూర్ కి సంబంధించిన ఖర్చులను డిపాజిట్ కూడా చేశారు. దీంతో వారి టూర్ కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తానికి 45 ఏళ్ల తరువాత మళ్లీ మానవులు రోదసి ప్రయాణం చేయనున్నారు.
తొలుత ఈ ఏడాది చివర స్పేస్ ఎక్స్ సంస్థ మానవరహిత వ్యోమనౌకను ప్రయోగిస్తుంది. ఆ తరువాత 2018లో ఇద్దరు టూరిస్టులతో కూడిన వ్యోమనౌక చంద్రుడిపైకి బయలుదేరుతుంది. ఈ టూర్ కి సంబంధించి నాసా ప్రణాళిక తయారు చేసినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది.
అయితే చంద్రుడి మీదకు వెళ్లే ఆ ఇద్దరు పర్యాటకులు ఎవరన్న విషయం మాత్రం స్పేస్ ఎక్స్ వెల్లడించలేదు. వాళ్ల ఐడెంటిటీని విడుదల చేయలేదు. కాకపోతే వారు ఒకరికి ఒకరు తెలుసు అని మస్క్ తెలిపారు.
చంద్రమండలం వెళ్లే ప్రయాణికులు ఇద్దరూ హాలీవుడ్ కు చెందిన వాళ్లు మాత్రం కాదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. ఆ టూరిస్టులిద్దరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 1970 దశకంలో అమెరికా ప్రయోగించిన అపోలో మిసన్ ద్వారా చంద్రుడిపైకి ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. అయితే ఈసారి వెళ్లే టూరిస్టులు మాత్రం చంద్రుడి మీద దిగరు, కేవలం చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చేస్తారని స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు.