కరోనా వద్ద బేరాల్లేవమ్మా: తరతమ భేదాలు చూపని వైరస్: యువరాణిని కబలించిన మహమ్మారి: రాచకుటుంబం
మాడ్రిడ్: కరోనా వైరస్ విలయతాండవానికి స్పెయిన్ అల్లాడుతోంది. ఇటలీ తరువాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి స్పెయిన్లో. అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే ఈ అభివృద్ధి చెందిన దేశంలో కరోనా ధాటికి అక్కడి ప్రజలు కుదేలు అవుతున్నారు. రోజురోజుకూ స్పెయిన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 70 వేల మందికి పైగా స్పానిష్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటోన్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది.
రాచ కుటుంబ సభ్యులను కబళించడం ఇదే తొలిసారి..
తాజాగా-స్పానిష్ రాచకుటుంబాన్ని కూడా వదల్లేదు కరోనా వైరస్. పేద, ధనిక తనకు తరతమ భేదాలేమీ లేవని స్పష్టం చేసినట్టయింది. స్పానిష్ యువరాణిని పొట్టనబెట్టకుంది. మృత్యువు అందరినీ సమానంగా చూస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని చాటినట్టయింది. ఓ రాచకుటుంబానికి చెందిన వారు కరోనా వైరస్ బారిన పడి మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి. ఆమెను బతికించుకోవడానికి రాచ కుటుంబ సభ్యులు, డాక్టర్లు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ.. మరణం తప్పలేదు.
86 సంవత్సరాల రెడ్ ప్రిన్సెస్..
ఆ యువరాణి పేరు మారియా టెరెసా డి బోర్బొన్ పర్మా. వయస్సు 86 సంవత్సరాలు. స్పెయిన్ రాజు ఫెలెప్-4కు ఆమె సోదరి వరుస అవుతారు. మారియా టెరెసా మరణాన్ని స్పెయిన్ రాచకుటుంబం ధృవీకరించింది. మారియా సోదరుడు అరన్జుగేజ్ డ్యూక్ ప్రిన్స్ సిక్స్టో ఎన్రిక్ డి బార్బన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తన సోదరి మారియా టెరెసా డి బోర్బొన్ పర్మా ప్యారిస్లో కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు తెలిపారు. దీనిపై తన ఫేస్బుక్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన పొందుపరిచారు.
స్పెయిన్ రాజుకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారం రోజుల్లో..
స్పెయిన్ రాజు ఫెలెప్-4కు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించిన వారంరోజుల వ్యవధిలో ఆమె మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫెలెప్కు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు వైరస్ సోకలేదని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న ఏడో రోజు మారిటా టెరెసా మరణించారు. రెడ్ ప్రిన్సెస్గా అందరూ ముద్దుగా పిలుచుకునే మారియా 1933 జూలై 28వ తేదీన మారియా జన్మించారు.
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా..
వృత్తిరీత్యా ఆమె ప్రొఫెసర్. ప్యారిస్లోని ప్రతిష్ఠాత్మక మ్యాడ్రిడ్ క్యాంపుల్టెన్స్ యూనివర్శిటీలో ఆమె సోషియాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. సామాజిక కార్యకర్తగా సేవలందించారు. మారియా పార్థివ దేహానికి అయిదు రోజుల తరువాత అంటే శుక్రవారం మ్యాడ్రిడ్లో అంత్యక్రియలను నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ కూడా ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో కొనసాగుతున్నారు.