అరబ్ లో మసాలాల మధ్యలో డ్రగ్స్ సరఫరా
అరబ్: మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా సభ్యులను అరబ్ లోని అబుధబి పోలీసులు అరెస్టు చేశారు. మసాలా దినుసుల మధ్యలో డ్రగ్స్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో మహిళలు ఉన్నారు.
అబుధబి సీఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మసలా దినుసులు తరలిస్తున్న 8 మంది అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న398 సంచులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.
అందులో డ్రగ్స్ ఉన్న విషయం గుర్తించి అందరిని అదుపులోకి తీసుకున్నారు. తాము మసాలా దినుసుల మధ్యలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని నిందితులు అంగీకరించారు. వీరిలో కొందరికి మసాలా దినుసులు సరఫరా చేసే వ్యాపారాలు ఉన్నాయని, కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని విచారణలో వెలుగు చూసింది.
మొత్తం ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 8 మందిని అరెస్టు చేసి రూ. లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని సీఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ అన్నారు. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చారు ? ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తున్నామని డాక్టర్ రషీద్ మొహమ్మద్ స్థానిక మీడియాకు చెప్పారు.