కొలంబో టూ జర్మనీ: పైలెట్ ఫుల్ టైట్
కొలంబో: విమాన ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన ఓ తాగుబోతు పైలెట్ అడ్డంగా బుక్కయ్యాడు. అతను ఫుల్లుగా తేగేసి విమానం నడపడానికి ప్రయత్నించాడు.
విషయం గుర్తించిన అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరిక్షలు చేస్తే అయ్యగారు పీకలదాక మద్యం సేవించిన విషయం వెలుగు చూసింది. ఉపేంద్ర రణవీర అనే పైలెట్ లైసెన్స్ రద్దు చేసి నోటీసులు ఇచ్చారు.
అధికారుల కథనం మేరకు కొలంబో నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ వెళ్లాల్సిన యూఎల్ 554 విమానంలో 259 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం పైలెట్ ఉపేంద్ర రణవీర. అయితే ఇతను మద్యం సేవించి రన్ వే మీద ఉన్న విమానం దగ్గరకు బయలుదేరాడు.
ఉపేంద్ర రణవీర తూగుతూ తూగుతూ వెలుతున్న విషయం అధికారులు గుర్తించారు. వెంటనే అతనికి వైద్య పరిక్షలు నిర్వహించి మద్యం సేవించాడని గుర్తించారు. ఇతని కారణంగా విమానం 15 గంటల ఆలస్యంగా జర్మనీ బయలుదేరింది.
నిబంధనల ప్రకారం ప్రయాణికులకు భోజనాలు, వసతి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రయాణికుడికి 600 యూరోలు (రూ. 45 వేలు) పరిహారం చెల్లించారు. కేవలం ఈ పరిహారానికే సంస్థ మీద దాదాపు రూ. కోటి భారం పడింది.
ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురుకాకుండా చూస్తామని హామి ఇచ్చింది. శాస్వతంగా మీ లైసెన్స్ ను ఎందుకు రద్దు చెయ్యకూడదో 7 రోజుల్లో చెప్పాలని ఉపేంద్ర రణవీరకు డీజీసీఏ నిమల్ సిరి నోటీసులు ఇచ్చారు.