దేశాధ్యక్షుడు చనిపోతాడంటూ జోస్యం.. పోలీసుల అదుపులో జ్యోతిష్కుడు
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు.
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 27 లోపు అనారోగ్యంతోకానీ, ప్రమాదంలోకానీ సిరిసేన చనిపోతారంటూ సదరు జ్యోతిష్కుడు ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
శ్రీలంక వాసులు జ్యోతిష్యాన్ని బాగా నమ్యుతుంటారు. ప్రస్తుతం జ్యోతిష్కుడి అవతారం ఎత్తిన విజేముని ఇంతకుమునుపు నేవీలో పని చేసేవాడు. 1989లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకు వచ్చినప్పుడు ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన నేరానికి శిక్ష కూడా అనుభవించాడు.
ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ సామాజిక మాధ్యమాలలో విజేముని వీడియోలు పెడుతుండడంతో ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.
ఇతడి కారణంగా ఏదో ఒక సమస్య తలెత్తుతుందని భావించిన మీడియా శాఖ సెక్రటరీ నిమల్ బోపేజ్.. విజేముని గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టమని గత డిసెంబర్ లోనే పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం విజేమునిని అరెస్టు చేశారు.