శ్రీలంక నరమేథం! ఐసిస్ పనే! జిహాదీలుగా నిర్ధారణ
కొలంబో: రాజధాని కొలంబో సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లపై దాడులు చేసి, నరమేథానికి పాల్పడిన ఘటన వెనుక భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉందని తేలింది. ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు ఈ ఘటనకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జహ్రెయిన్ హుస్సేన్, అబు మొహమ్మద్ అనే ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. జిహాద్ పేరుతో దాడులు చేసినట్లు గుర్తించారు.
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో
పర్యాటకుడి రూపంలో..
శ్రీలంక మారణ కాండ వెనుక..భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది. ఐసిస్ ఆత్మాహూతి దళం ఈ దాడులు చేసినట్లు తేలింది. జహ్రెయిన్ హుస్సేన్, అబు మొహమ్మద్ రెండు ప్రాంతాల్లో ఈ దాడులకు తెగబడినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. జహ్రెయిన్ హుస్సేన్.. పర్యాటకునిగా షాంగ్రిలా హోటల్ కు వెళ్లినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. షాంగ్రిలా హోటల్ లో ప్రవేశించిన అనంతరం- తనను తాను పేల్చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మరో ఉగ్రవాది అబు మొహమ్మద్ బట్టికలోవాలోని చర్చిపై దాడికి పాల్పడ్డాడని అధికారులు గుర్తించారు. అతను కూడా పర్యాటకుడి రూపంలో చర్చి వద్దకు వెళ్లి ఉంటాడని శ్రీలంక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాథమికంగా ధృవీకరించింది. మిగిలిన నాలుగు చోట్ల కూడా ఇదే తరహాలో ఆత్మాహూతి దళ సభ్యులే దాడులు చేసి ఉంటారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఏవీ తమ చేతికి చిక్కలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
తొలి పంజా..
సిరియాపై పట్టు కోల్పోయిన తరువాత ఐసిస్.. భారీ ఎత్తున మారణ హోమానికి పాల్పడటం ఇదే తొలిసారి. సిరియాలో ఐసిస్ ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలను అమెరికా, ఫ్రాన్స్ , రష్యానేతృత్వంలోని సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ఐసిస్ ఉగ్రవాదులను తరిమికొట్టాయి. ఈ ఉదంతం తరువాత క్రమేణా ఐసిస్ తన పట్టు కోల్పోతూ వచ్చింది. ఇక ఐసిస్ పనైపోయిందనుకుని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా ఆ సంస్థ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విధ్వంసాన్ని సృష్టించారు. 129 మందికి పైగా ప్రజలను పొట్టన బెట్టుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం ఐసిస్ చరిత్రలో కూడా ఇదే తొలిసారి అయి ఉండొచ్చని అంటున్నారు. శ్రీలంకను టార్గెట్ గా చేసుకుని విలాయాన్ని సృష్టించారు. జిహాద్ పేరుతో ఈ దాడులు చేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మరో నాలుగు చోట్ల దాడులూ వారి పనే..
హోటల్ షాంగ్రిలా సహా బట్టికలోవాలోని చర్చిపై ఐసిస్ ఆత్మాహుతి దళ ఉగ్రవాదులే దాడులు చేశారని తేలడంతో.. ఇక మిగిలిన నాలుగు చోట్ల విధ్వంసాన్ని సృష్టించింది కూడా వారే అయి ఉంటారని శ్రీలంక భద్రతా బలగాలను ఓ నిర్ధారణకు వచ్చాయి. `జిహాదీల దాడులు` అనే కోణంలో తమ దర్యాప్తును మొదలు పెట్టాయి. గుడ్ ఫ్రైడేకు ముందు రోజు లేదా అంతకుముందే- ఐసిస్ ఉగ్రవాదులు శ్రీలంక చేరుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. పర్యాటకుల రూపంలో వచ్చి, దాడులు చేశారా? లేక స్థానికులను ఈ ఘాతుకానికి పురిగొల్పారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.