శ్రీలంక దాడులు: అదుపులో ఏడుమంది అనుమానితులు: సీసీటీవీ ఫుటేజీ విడుదల
కొలంబో: శ్రీలంకలో నరమేధానికి కారణమైన వరుస ఆత్మాహూతి దాడుల కేసుల్లో పోలీసులు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులై ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు.
ఓ యువకుడు భుజానికి బ్యాగును తగిలించుకుని చర్చిలోకి ప్రవేశిస్తున్న దృశ్యం.. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. దీన్ని స్థానిక మీడియాకు విడుదల చేశారు. నేషనల్ తౌహీక్ జమాత్ అనే ఇస్లామిక్ ర్యాడికల్ గ్రూప్ సంస్థ ఈ దాడులకు కారణమై ఉండొచ్చని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. బట్టికలోవాలోని చర్చిపై జహ్రెయిన్, కొలంబోలోని షాంగ్రిలా హోటల్ పై అబు మొహమ్మద్ అనే యువకుడు దాడులు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ రెండూ ఆత్మాహూతి దాడుల పనేనని నిర్ధారించారు.
మిగిలిన ప్రాంతాల్లో చోటు చేసుకున్న పేలుళ్లు కూడా ఒకే తరహాలో ఉండటం వల్ల అక్కడ కూడా ఆత్మాహూతి దాడులే సంభవించి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.