ఇబ్బందుల్లో శ్రీలంక : కాల్పుల ఘటనతో దేశవ్యాప్తంగా ఇంధనం కొరత
కొలంబో: గత వారం శ్రీలంక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఇంధన ధరలపై పడింది. ఆ దేశంలో ఇంధనం కొరత ఏర్పడింది. అయితే బుధవారం సాయంత్రానికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.
కొలంబోలోని డిమాటాగుడాలో ఉన్న సిలాన్ పెట్రోలియం కార్పోరేషన్ ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న వారిపై శ్రీలంక కేంద్ర మాజీ పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశానికి ఇంధనం సరఫరాను నిలిపివేశారు. ఇక దేశం మొత్తం ఇంధనం లేక ఇబ్బందుల్లోకి జారుకోవడంతో బుధవారం సాయంత్రంకల్లా ఇంధనం సరఫరా జరుగుతుందని సిలోన్ పెట్రోలియం ప్రైవేట్ బోసర్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. అంతేకాదు ఇంధనం సరఫరా సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచే ప్రారంభించినట్లు అసోసియేషన్ సెక్రటరీ శాంత సిల్వ తెలిపారు. కాల్పుల ఘటనతో ట్రేడ్ యూనియన్ స్ట్రైక్కు పిలుపునివ్వడంతో సరఫరా నిలిచిపోయిందని శాంత సిల్వ వెల్లడించారు.
అర్జున రణతుంగను పోలీసులు అరెస్టు చేయడంతో ట్రేడ్ యూనియన్ బంద్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని శాంత సిల్వా చెప్పారు. రణతుంగ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. రణిల్ విక్రమసింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా రణతుంగా ఉన్నారు. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి ఆదేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తొలగించారు. ఆయేన స్థానంలో మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు.