శ్రీలంకలో అదుపుతప్పిన శాంతిభద్రతలు.. ఎమర్జెన్సీ విధింపు!
కొలంబో: శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 10 రోజులపాటు ఈ ఎమర్జెన్సీ విధించారు.
హిందూ మహాసముద్రం ద్వీపం కాండీ జిల్లాలో ముస్లింలు, బౌద్ధుల మధ్య చెలరేగిన అల్లర్లు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలోని బౌద్ధులు, ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముస్లింలు పురాతన బౌద్ధమత కట్టడాలను ధ్వంసం చేస్తూ, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారనేది బౌద్ధుల ఆరోపణ.
అంతేకాదు, మాయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిం శరణార్థులు శ్రీలంకకు రావడాన్ని కూడా బౌద్ధ జాతీయవాదులు వ్యతిరేకిస్తున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన అల్లర్లతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందు జాగత్ర చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు.
కాండీలో ముస్లింల దుకాణానికి ప్రత్యర్థులు నిప్పంటించడంతో ఇక్కడ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఈ ప్రాంతంలో సోమవారం కర్ఫ్యూ విధించిన శ్రీలంక ప్రభుత్వం, అక్కడకు భారీగా బలగాలను తరలించింది. సింహళేశ బౌద్ధులు ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ముస్లింలు సంఖ్య తక్కువ. అల్లర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు.
ఈ అల్లర్ల వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తలు చోటుచేసుకోవడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసి, అత్యవసర పరిస్థితిని విధించాలని నిర్ణయం తీసుకున్నారని శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి దయసిరి జయశేఖర ప్రకటించారు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్ట్లు పెట్టినా, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.