శ్రీలంకలో సిరియా దేశస్థుడి అరెస్ట్: పేలుళ్లకు సూత్రధారిగా అనుమానాలు?
కొలంబో: క్రైస్తవుల పవిత్ర దినం ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో చర్చ్ లు, హోటళ్లపై భయానక దాడులకు పాల్పడిన వారి కోసం ఆ దేశ పోలీసులు, భద్రతా బలగాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా పోలీసులు అనుమానితుల నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. నిందితులు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా.. సిరియాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనితో- ఈ మహోగ్ర దాడుల వెనుక ఐసిస్ హస్తం ఉండొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
శ్రీలంక మారణహోమం వెనుక ఎన్టీజే హస్తం?
ఈస్టర్ సండేతో పాటు మరుసటి రోజు కూడా శ్రీలంకలో రెండుచోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మృతుల సంఖ్య 321కి చేరింది. మరణాలు అక్కడితో ఆగేలా లేవని తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
బాంబు పేలుళ్లు చోటు చేసుకుని 48 గంటలకు పైగా సమయం గడిచినప్పటికీ.. దీనికి తామే బాధ్యులమంటూ ఇప్పటికీ ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు. చాలాకాలంగా శ్రీలంకలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థ ప్రమేయం ఉందంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా- ఇప్పటిదాకా 40 మంది అనుమానితులను పోలీసులు, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణ ముమ్మరం చేశాయి. అనుమానితులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తాజాగా- ఓ సిరియా దేశస్థుడిని అరెస్టు చేశాయి.
సిరియా దేశస్థుడి వయస్సు సుమారు 26 సంవత్సరాలు ఉండచ్చని తెలుస్తోంది. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ మూలాలు ఉన్నవి సిరియాలోనే కావడంతో.. ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చంటూ అనుమానిస్తున్నారు పోలీసులు. అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి శ్రీలంకలో ఉంటున్నాడు? స్థానికంగా అతనికి ఎవరు సహకరించి ఉంటారు? ఏ రూపంలో అతను వచ్చాడు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అతని వద్ద నుంచి మరింత కీలక సమాచారం రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
వ్యాన్ డ్రైవర్, ఇంటి యజమాని కూడా..
పోలీసులు అరెస్టు చేసిన 40 మంది అనుమానితుల్లో ఓ వ్యాన్ డ్రైవర్, ఇంటి యజమాని కూడా ఉన్నారు. వారిద్దరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహూతి దళ సభ్యులు కొలంబో చేరుకున్న తరువాత, స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని, ఆ ఇంటి యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని కొలంబో పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనతో పాటు- ఆత్మాహూతి దళ సభ్యులను ఇంటి నుంచి స్థానిక సెబాస్టియన్ చర్చ్ కు తీసుకెళ్లిన వ్యాన్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
మృతుల సంఖ్య..మరింత
ఇదిలావుండగా.. శ్రీలంకలో చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడుల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం నాడు సుమారు 10కి పైగా మరణించారు. చర్చ్ లు, హోటళ్లపై ఈస్టర్ సండే నాడు చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడుల్లో గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారే. తాజా మరణాలతో మృతుల సంఖ్య 321కి చేరింది. ఇంకా పలువురు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.